ఖానాపూర్ : గిరిజన ఆదివాసీల అభ్యున్నతి, ఆత్మగౌరవానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ ( Bhukya Johnson Naik
) నాయక్ అన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం గిరిజన ఆదివాసీ యువత భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే నిర్ణయమని పేర్కొన్నారు.
ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఏఎంకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని, ఎస్టీల కోసం 183 గురుకులాలను ఏర్పాటు చేసి 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్య అందించేలా చర్యలు చేపట్టారని అన్నారు.
రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను సైతం ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 500 జనాభా కలిగిన ప్రతి తండా, ఆవాస గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించి 1,326 తండాలు, 525 గూడెలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచేందుకు 2022లో అసెంబ్లీలో తీర్మానం చేసి, ఉద్యోగ, విద్య, ఉపాధి రంగాల్లో అమలుకు శ్రీకారం చుట్టారన్నారు.
గిరిజన, ఆదివాసీలకు పోడు పట్టాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 2023లో చేవెళ్ల వేదికగా కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్లో ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతం నుంచి 12 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అర్హులైన గిరిజన ఆదివాసీల పోడు భూముల పట్టాల ప్రక్రియను పూర్తి చేసి హక్కు పత్రాలు అందించా లని కోరారు.