ప్రస్తుత ఐపీఎల్లో పేలవ ఫామ్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా ఉన్న శ్రేయాస్.. టోర్నీ ప్రారంభానికి ముందు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దాంతో అతనిపై చాలా అంచనాలు నెలకొన్నాయి. అయితే శ్రేయాస్ ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడు. అంతేకాదు, అతని షార్ట్ బాల్ బలహీనత ఐపీఎల్లో చాలా స్పష్టమైంది.
ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడేందుకు కేకేఆర్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో లక్నో బౌలర్లు.. శ్రేయాస్ను తమ షార్ట్ బాల్స్తో పరీక్షిస్తారని, దానికి అతను సిద్ధంగా ఉండాలని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఆ బంతులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని శ్రేయాస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పాడు. ప్రస్తుత సీజన్లో సరైన ఫామ్లో లేనప్పటికీ కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసింది శ్రేయాసే కావడం గమనార్హం.