భారత వన్డే ఓపెనింగ్ ద్వయం శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ ఇద్దరూ కలిసి నేడు ఇంగ్లండ్ తో జరుగనున్న మ్యాచ్ లో 43 పరుగులు చేస్తే ధావన్-రోహిత్ ల జోడీ నాటి వెస్టిండీస్ దిగ్గజాలు గోర్డాన్ గ్రీనిడ్స్-డెస్మాండ్ హేన్స్ లు నెలకొల్పిన రికార్డును బద్దలు కొడతారు. అందుకు నేడు ఇంగ్లండ్-ఇండియా రెండో వన్డే వేదిక కానున్నది.
లార్డ్స్ వేదికగా జరుగబోయే రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు మరో 43 పరుగులు చేస్తే వారి భాగస్వామ్యం 5,151 పరుగులకు చేరుతుంది. తద్వారా వాళ్లు.. గోర్డాన్ గ్రీనిడ్జ్-డెస్మాండ్ హేన్స్ లు (1979 నుంచి 1991 వరకు) నెలకొల్పిన ఓపెనింగ్ రికార్డు (102 ఇన్నింగ్స్ లలో 5,150 పరుగులు) ను అధిగమిస్తారు. ధావన్ – రోహిత్ లు ప్రస్తుతం 5,108 పరుగులతో.. 5 వేలకు పైన స్కోరు చేసిన ఓపెనింగ్ ద్వయంలో నాలుగో స్థానంలో నిలిచారు.
వన్డేలలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం సచిన్-గంగూలీ (6,609) పేరిట ఉంది. ఆ తర్వాత జాబితాలో ఆస్ట్రేలియా కు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ – మాథ్యూ హెడెన్ (5,372) లు ఉన్నారు. మూడో స్థానంలో గ్రీనిడ్జ్-హేన్స్ (5,150) లు నిలిచారు. ఇక 112 ఇన్నింగ్స్ లలో ధావన్-రోహిత్ లు 5,108 పరుగులు చేశారు. రెండ్రోజుల క్రితం ఇంగ్లండ్ తో ముగిసిన తొలి వన్డేలో 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ ఇద్దరూ నాటౌట్ గా నిలవడంతో ఈ జోడీ 5 వేల పరుగుల క్లబ్ లో చేరారు.