తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ మరోమారు తళుక్కుమంది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన ఇషా.. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు బెర్తు దక్కించుకుంది. సహచర షూటర్ల నుంచి పోటీని దీటుగా ఎదుర్కొన్న ఇషా.. కెరీర్లో తొలిసారి విశ్వక్రీడలకు అర్హత సాధించింది. ఏషియన్ క్వాలిఫయర్స్ టోర్నీలో పసిడి పతకం ద్వారా తన కల నెరవేర్చుకుంది. అదే జోరుతో టీమ్ఈవెంట్లోనూ పసిడి వెలుగులు విరజిమ్మింది. ఇషాకు తోడు వరుణ్ ఒలింపిక్స్ కోటా దక్కించుకున్నాడు.
జకార్తా: తెలంగాణ స్టార్ షూటర్ ఇషాసింగ్..రానున్న పారిస్ ఒలింపిక్స్కు టిక్కెట్ ఖాయం చేసుకుంది. పలు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా యుక్త వయసులోనే దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇషాసింగ్..తన కెరీర్లో తొలిసారి విశ్వక్రీడలకు అర్హత సాధించి ఔరా అనిపించింది.
ఏషియన్ క్వాలిఫయర్స్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో ఈ హైదరాబాదీ షూటర్ పసిడి పతకంతో మెరిసింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన తుది పోరులో ఇషాసింగ్(243.1) అగ్రస్థానంతో స్వర్ణం దక్కించుకోగా, కిష్మాల తలాత్(236.3, పాకిస్థాన్), రితమ్ సాంగ్వాన్(214.5) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన ఇషా..చెక్కుచెదరని గురితో ఆకట్టుకుంది. రౌండ్ రౌండ్కు తన ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయిన ఈ 19 ఏండ్ల షూటర్ అనుకున్న ఫలితాన్ని సాధించింది. ప్రత్యర్థి షూటర్ల నుంచి దీటైన పోటీ ఎదురైనా పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. అదే జోరు కొనసాగిస్తూ టీమ్ఈవెంట్లో రిథమ్, సురభి రావుతో కలిసి 1736 స్కోరుతో ఇషాసింగ్ మరో పసిడి పతకం దక్కించుకుంది.
పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో వరుణ్ తోమర్(239.6) స్వర్ణ పతకాన్ని ముద్దాడి పారిస్ బెర్తు ఖరారు చేసుకున్నాడు. ఇదే విభాగంలో భారత్కు చెందిన అర్జున్సింగ్(237.3), దవక్షు(217.2) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. తోమర్, చీమా, ఉజ్వల్ మాలిక్తో కూడిన భారత త్రయం 1740 స్కోరుతో 10మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం దక్కించుకుంది. ఇదే విభాగంలో ఇరాన్కు రజతం, కొరియాకు కాంస్యం లభించాయి.
ఇషాసింగ్, వరుణ్తోమర్ ద్వారా పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో భారత్ బెర్తుల సంఖ్య 15కు చేరుకోవడం విశేషం. ఇది టోక్యో(2020) అర్హతకు సమానంగా నిలిచింది. టోర్నీలో మరికొన్ని పోటీలు మిగిలున్న నేపథ్యంలో బెర్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10మీటర్లతో పాటు 25 మీటర్ల విభాగంలోనూ ఇషాసింగ్ బెర్తు దక్కించుకునే చాన్స్ ఉందని తండ్రి సచిన్సింగ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. పోటీల తొలి రోజైన సోమవారం భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, చైనా(4), ఉజ్బెకిస్థాన్(1) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ప్రణాళికబద్ధమైన ట్రైనింగ్, క్రమశిక్షణ..ఇషాసింగ్ విజయవంతం కావడానికి కారణాలు. పారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకోవడం ద్వారా దేశం గర్వపడేలా చేసింది. ఇటీవల ఆసియాగేమ్స్లో నాలుగు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా విశ్వక్రీడలకు అర్హత సాధించింది. 13 ఏండ్ల ప్రాయం నుంచే ఇషా అద్భుతంగా రాణిస్తూ వస్తున్నది. బరిలోకి దిగిన 99శాతం టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టింది.
– సచిన్సింగ్, ఇషా తండ్రి