BCB : ఇటీవల భారత్లో టీ20 ప్రపంచకప్లో ఆడబోమంటూ ఐసీసీ(ICC) ఆగ్రహానికి గురైన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. సీనియర్లకు షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో మెరుస్తున్న పలువురికి జీతాల్లో భారీ కోత విధించింది. వార్షిక సెంట్రల్ కాంట్రాక్టు(Annual Central Contracts)లో కుర్రాళ్లకు ప్రాధాన్యమిచ్చిన బోర్డు… మాజీ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో, పేసర్ తస్కిన్ అహ్మద్లను గ్రేడ్ ఏలోకి మార్చింది. వెటరన్ ముష్ఫికర్ రహీంను ఏకంగా బీ గ్రేడ్ కేటాయించింది. కెప్టెన్ లిటన్ దాస్ గ్రేడ్ ఏలో ఉండగా.. ఆల్రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్కు సైతం చోటు దక్కింది.
సెంట్రల్ కాంట్రాక్టు విధానంలో బీసీసీఐని అనుసరించింది బంగ్లాదేశ్ బోర్డు. ఇటీవల భారత బోర్డు ఏ ప్లస్ గ్రేడ్ను ఎత్తివేయగా.. బీసీబీ సైతం అదే పని చేసింది. దాంతో.. ఇంతకుముందు ఈ కేటగిరీలో ఉన్న తస్కిన్ అహ్మద్ ఏ గ్రేడ్కు వచ్చాడు. నెలకు రూ.7 లక్షలు అందుకున్న తస్కిన్కు ఇకపై రూ.5.9లక్షలు మాత్రమే దక్కనున్నాయి.
Bangladesh have announced their men’s central contracts list for 2026 🇧🇩 pic.twitter.com/9TkLmrac5P
— ESPNcricinfo (@ESPNcricinfo) February 20, 2026
నిరుడు ఆసియా కప్లో నిలకడగా రాణించిన షద్మాన్, తంజిద్ హసన్, రిషద్ హొసేనర్తో పాటు మహెది హసన్కు ప్రమోషన్ దక్కింది. ఇదివరకూ గ్రేడ్ సీలో ఉన్న వీరంతా గ్రేడ్ బీకి ఎంపికయ్యారు. గ్రేడ్ బీలోని ఆటగాళ్లకు నెలకు రూ.4.4 లక్షలు బీసీబీ చెల్లించనుంది. ఈ లెక్కన గ్రేడ్ సీ, గ్రేడ్ డీలోని క్రికెటర్లకు లక్షకు పైగా ఆదాయం రానుంది.
గ్రేడ్ ఏ – నజ్ముల్ హుసేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, లిటన్ దాస్, తస్కిన్ అహ్మద్
గ్రేడ్ బీ – ముష్ఫికర్ రహీం, మొమినుల్ హక్, తైజుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తౌహిద్ హృదోయ్, షద్మాన్ ఇస్లాం, తంజిద్ హసన్, రిషద్ హొసేన్, మహేది హసన్, హసన్ మహమూద్, నహిద్ రానా
గ్రేడ్ సీ – సౌమ్యా సర్కార్, జకీర్ అలీ, షొరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్, నసుమ్ అహ్మద్, ఖలెద్ అహ్మద్
గ్రేడ్ డీ – సైహ్ హసన్, పర్వేజ్ హొసేన్, తన్వీర్ ఇస్లాం, నయీం హసన్, హసన్ మురాద్, షమీం హొసేన్, నురుల్ హసన్
టీ20 ప్రపంచకప్లో ఆడాల్సిన బంగ్లాదేశ్ జట్టు అనూహ్యంగా తప్పుకుంది. భద్రతా కారణాలు సాకుగా చూపి.. పాక్ బోర్డు మద్దతుతో మేము భారత్లో ఆడబోమని పట్టుపట్టడంతో ఐసీసీకి చిర్రెత్తుకొచ్చింది. మీరు ఆడకుంటే మరొకరు అంటూ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాంట్లాండ్కు అవకాశం లభించింది. వరల్డ్కప్ ఆడలేకపోయిన బంగ్లాదేశ్ మార్చిలో పాకిస్థాన్తో తలపడనుంది. స్వదేశంలో జరుగబోయే ఈ సిరీస్లో సత్తా చాటాలని బంగ్లా క్రికెటర్లు సమాయత్తమవుతున్నారు.