టీ20లకు పెరుగుతున్న క్రేజ్, టెస్టు క్రికెట్పై ఆటగాళ్లకు ఉన్న ప్రేమ కారణంగా మధ్యలో వన్డే ఫార్మాట్ ఎటూ కాకుండా పోతున్నది. 50 ఓవర్ల ఫార్మాట్కు కాలం చెల్లిందని పలువురు క్రికెట్ పండితులు ఇప్పటికే తమ వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై చర్చ జోరుగా సాగుతున్నది.
ఈ క్రమంలో వన్డేలు రాను రాను మరీ బోర్ అవుతున్నాయని, వాటిలో ఓవర్లను తగ్గిస్తే ఆ ఫార్మాట్నూ వినోదభరితంగా మార్చొచ్చని పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది అన్నాడు. అతడు మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వన్డే క్రికెట్ మరీ బోరింగ్గా తయారైంది. నన్నడిగితే ఆ ఫార్మాట్ను 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించాలి. అప్పుడది వినోదభరితంగా మారుతుంది..’ అని అన్నాడు.
అఫ్రిది వ్యాఖ్యలకు టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి మద్దతు తెలిపాడు. ఇదే విషయమై అతడు స్పందిస్తూ.. ‘అవును. వన్డే క్రికెట్లో ఓవర్లను కుదిస్తే నష్టమేమీ లేదు. వన్డే క్రికెట్ ప్రారంభమైనప్పుడు 60 ఓవర్లుండేవి. మేము 1983లో ప్రపంచకప్ గెలిచినప్పుడూ 60 ఓవర్లు ఆడాం. ఆ తర్వాత 60 ఓవర్లు మరీ ఎక్కువని, దానిని 50 ఓవర్లకు కుదించారు..
చాలా ఏండ్లుగా ఇదే విధానంలో వన్డేలను ఆడుతున్నారు. ఇప్పుడు దీనిని ఎందుకు మార్చకూడదు. క్రికెట్ అభిమానులు కూడా అది 40 ఓవర్లకు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. 60 నుంచి 50కి మార్చినప్పుడు 50 నుంచి 40కి మారిస్తే తప్పేంటి..? అందువల్ల ముందుచూపుతో సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది..’ అని శాస్త్రి తెలిపాడు.