శేరిలింగంపల్లి, అక్టోబర్ 16: ప్రస్తుత సమాజంలో చిన్నారులు వీడియో గేమ్లు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని అలాంటి వారిని క్రీడలకు దగ్గర చేసేందుకు స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్ఎఫ్ఏ) ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ఫర్ ఆల్ చాంపియన్షిప్కు మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ చాంపియన్షిప్కు క్రీడా ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లోని క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు తోడ్పడుతుందన్నారు. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవిత ప్రయాణంలో క్రీడలు కీలక భాగమన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, సమీర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.