ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో బెల్జియం పోరాటం ముగిసింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బెల్జియం లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. క్రొయేషియాతో కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో బెల్జియం స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయింది. దురదృష్టం వెంటాడిన వేళ ఎలాంటి గోల్ లేకుండానే పోరు డ్రాగా ముగిసింది. కెనడాపై విజయంతో మొరాకో ముందడుగు వేసింది. పోలాండ్ను ఓడించిన అర్జెంటీనా ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించగా, దక్షిణ కొరియాతో పోర్చుగల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
దోహా: ఫిఫా ప్రపంచకప్లో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. నాకౌట్ రౌండ్ సమీపిస్తున్న వేళ ప్రతీ మ్యాచ్ కీలకంగా మారుతున్నది. కచ్చితంగా పోటీలో నిలుస్తాయనుకున్న జట్లు ఉత్తచేతులతో నిష్క్రమిస్తున్నాయి. మేటి జట్లలో ఒకటైన బెల్జియం పోరాటానికి లీగ్ దశతోనే ఫుల్స్టాప్ పడింది. గెలిస్తేనే నిలిచే పరిస్థితుల మధ్య క్రొయేషియాతో పోటీకి దిగిన వరల్డ్ నంబర్టూ టీమ్ గోల్ లేకుండానే డ్రాతో సరిపెట్టుకుంది. మరోవైపు కెనడాపై 2-1తో విజయం సాధించిన మొరాకో (7), క్రొయేషియా (5) గ్రూపు-ఎఫ్ నుంచి ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించాయి. బెల్జియం, క్రొయేషియా మ్యాచ్ విషయానికొస్తే..ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈడెన్ హజార్డ్, రుమెల్ లుకాకు, కెవిన్ డీబ్రూయిన్ లాంటి స్టార్ స్ట్రైకర్లతో కూడిన బెల్జియం దాడులను క్రొయేషియా దీటుగా బదులిచ్చింది. బంతిని చెరి సగం ఆధీనంలో ఉంచుకున్న ఇరు జట్లు గోల్ ఖాతా తెరువలేకపోయాయి. బెల్జియం తరఫున లుకాకు చేసిన ప్రయత్నాలన్నీ తృటిలో చేజారాయి.
పోలాండ్తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో మెస్సీసేన 2-0తో విజయం సాధించి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించింది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలీస్టర్ (46ని), జులియన్ అల్వారెజ్ (67ని) గోల్స్ చేశారు.