ముంబై: ఐపీఎల్ ట్రోఫీని మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి ముద్దాడాడు. ఐపీఎల్-14 ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ను 27 పరుగుల తేడాతో ఓడించిన చెన్నై జట్టు ట్రోఫీ ఎగరేసుకుపోయింది. అయితే ధోనీ మరో ఐపీఎల్ సీజన్ ఆడతాడా? లేక రిటైర్ అవుతాడా? అనే సందేహాలు అభిమానుల మనసుల్లో నెలకొన్నాయి.
వీటిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. తన అభిప్రాయంలో ధోనీ మరో ఐపీఎల్ సీజన్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ ఆలోచన చేయాలని సెహ్వాగ్ అన్నాడు. ఒక కెప్టెన్ సక్సెస్ను గణాంకాలతో కొలుస్తారని చెప్పిన ఈ డాషింగ్ ఓపెనర్.. ఆ లెక్కన చూసుకున్నా కూడా నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచి, 9 సార్లు ఫైనల్లో ఆడిన చెన్నై జట్టుకు ధోనీ సారధ్యం వహించిన సంగతి మర్చిపోకూడదని చెప్పాడు.
ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన రోహిత్ శర్మ దోనీకి సమీపంలో ఉన్నాకూడా, 9 సార్లు ఫైనల్ చేరాలంటే మాత్రం అతనికి ఇంకొంత సమయం పడుతుందని వివరించాడు. ఐపీఎల్లో రెండేళ్లపాటు చెన్నై జట్టును బ్యాన్ చేసిన విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేశాడు.
‘‘రీఎంట్రీ ఇచ్చిన ఐపీఎల్లో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున సీజన్ను ముగించింది. అంటే ఐపీఎల్ ప్రారంభమైన 14 సంవత్సరాల్లో మూడేళ్లు ఈ జట్టు పోటీలో లేదు. కానీ మిగతా సీజన్లలో 9 సార్లు ఫైనల్ చేరి, నాలుగు సార్లు కప్పు కొట్టారంటే మాటలు కాదు’’ అని సెహ్వాగ్ తెలిపాడు.
ఈ క్రమంలోనే ధోనీ కనుక రిటైర్ అవ్వాలని అనుకుంటే మరో సీజన్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని అభిప్రాయపడ్డాడు. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్లో మరో రెండు జట్లు చేరనున్నాయి. ఈ క్రమంలో మెగా ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
దీంతో ఈ ఫ్రాంచైజీలో ధోనీ భవితవ్యంపై కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. అయితే చెన్నై జట్టు వచ్చే వేలంలో రిటెన్షన్ అవకాశం ఉంటే తాము తొలిగా ధోనీనే రిటైన్ చేసుకుంటామని స్పష్టం చేసింది. ఈ అవకాశం కచ్చితంగా ఉంటుందని, కానీ ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇస్తారో తెలియదని పేర్కొంది.