న్యూఢిల్లీ: దేశంలో తయారయ్యే అన్ని రకాల కార్లలో వచ్చే ఆగస్టు 31వ తేదీ నుంచి డ్రైవర్ సహ-ప్రయాణికుడి సీట్కు ఎయిర్బ్యాగ్ అమర్చడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఉత్పత్తయ్యే కార్లలో రెండు ఫ్రంట్ సీట్లకూ ఎయిర్బ్యాగ్లు అమర్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే రోడ్డు తిరుగుతున్న వాహనాల్లో ఆగస్టు 31లోగా ఫ్రంట్ రెండు సీట్లకు ఎయిర్బ్యాగ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఈ విషయమై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (ఎంఓఆర్టీహెచ్) గతేడాది డిసెంబర్లో అన్ని కార్లలో ఫ్రంట్ సీట్లకు ఎయిర్బ్యాగ్లను అమర్చాలని ప్రతిపాదించింది. జూన్ ఒకటో తేదీ నుంచి ఉత్పత్తయ్యే అన్ని కార్లలో వీటిని తప్పనిసరి ఏర్పాటు చేయాలని పేర్కొంటూ 2020 డిసెంబర్ 28న ముసాయిదా విడుదల చేసింది. దీనిపై నెల రోజుల్లో అభిప్రాయాలు తెలియజేయాలని ప్రజలను కోరింది.
2019 జూలై ఒకటో తేదీ నుంచి కార్లలో పలు భద్రతా ప్రమాణాల అమలును కేంద్రం తప్పనిసరి చేసింది. స్పీడ్ అలర్ట్ సిస్టం, డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ సీట్బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ అలర్ట్ సిస్టం, మాన్యువల్ ఓవర్రైడ్ ఫర్ సెంట్రల్ లాకింగ్ సిస్టం, డ్రైవర్ ఎయిర్బ్యాగ్ వినియోగం వంటి ఫీచర్లను అమర్చాలని కార్ల మేకర్లను కేంద్రం ఆదేశించింది. అప్పటికైతే కో-డ్రైవర్ సీటుకు ఎయిర్బ్యాగ్ను తప్పనిసరి చేయలేదు.
ప్రస్తుతం మారుతి సుజుకి ఆల్టో, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, మారుతి సుజుకి సెలెరియో, మారుతి సుజుకి వాగన్ఆర్, హ్యుండాయ్ సాంత్రో, రెనాల్ట్ క్విడ్, డస్టన్ రెడీ-గో, మహీంద్రా బొలెరో తదితర లోయర్ వేరియంట్ కార్లలో కో-డ్రైవర్ సీటుకు ఎయిర్బ్యాగ్ ఆఫర్ చేస్తున్నాయి. కో-డ్రైవర్ సీటుకు ఎయిర్బ్యాగ్ తప్పనిసరి చేయడంతో ఎంట్రీ లెవల్ కార్ల నుంచి అన్ని రకాల కార్ల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.