కరోనా నేపథ్యంలో ఉన్నత విద్యామండలి నిర్ణయం
ప్రవేశ పరీక్షలపైనా ప్రభావం..
ఆన్లైన్ పరీక్షలకు ఓకే
దరఖాస్తుల స్వీకరణ యథాతథం
హైదరాబాద్, శేరిలింగంపల్లి, బం జారాహిల్స్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిరకాల పరీక్షలను వాయిదావేస్తున్నట్టు ఉన్నతవిద్యామండలి బుధవారం ప్రకటించింది. యూనివర్సిటీలు నిర్వహించే డిగ్రీ, పీజీ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. అన్ని యూనివర్సిటీలకు ఇది వర్తిస్తుందని స్పష్టంచేశారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఉస్మానియా, కాకతీయ, బీఆర్ అంబేద్కర్, జేఎన్టీయూ, తెలంగాణ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలు కూడా పరీక్షలు వాయిదా వేస్తూ ప్రకటనలు జారీచేశాయి.
సీఎం ఆరా..
విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సహా మరికొంత మంది అధికారులతో ప్రగతిభవన్లో సమీక్షించారు. కరోనా తీవ్రమవుతున్నందున పరీక్షలను వాయిదావేయాలని సీఎం ఆదేశించారు. ఇంజినీరింగ్, వృత్తి విద్యాకోర్సుల్లో ఆన్లైన్ పరీక్షలకు అవకాశముంటే షెడ్యూల్ ప్రకారం జరుపుకోవచ్చని కళాశాల విద్యావిభాగం ఇంచార్జి కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ సూచించారు. జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష తరగుతులు నిర్వహిస్తే ఆ కాలేజీల గుర్తింపును రద్దుచేస్తామన్నారు.
అకడమిక్ పరీక్షలు వాయిదావేసిన నేపథ్యంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరీక్షలను కూడా వాయిదా వేస్తారా? యథావిధిగా నిర్వహిస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈసెట్, పీఈసెట్, ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. ఇంజినీరింగ్, న్యాయ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, బీపీఈడీ కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలకాగా, ఈ పరీక్షలు జూలై, ఆగస్టు నెలల్లో జరగాల్సి ఉన్నది. డిగ్రీ పరీక్షలు పూర్తయితేనే కొన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహించటం సాధ్యమవుతుంది. ఇప్పుడు డిగ్రీ పరీక్షలు వాయిదా పడటంతో అన్ని పరీక్షలపై సందిగ్ధం నెలకొన్నది. కాగా, ఎంసెట్, ఈసెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ దరఖాస్తుల స్వీకరణ యథావిథిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.