ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోమారు తన సహృదయతను చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తన స్నేహితురాలిని కాపాడిన ట్రాఫిక్ పోలీస్ను స్వయంగా కలుసుకుని సచిన్ కృతజ్ఞతలు తెలిపాడు. విధులు నిర్వర్తిస్తూ ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీస్ అధికారి సమయస్ఫూర్తిని మాస్టర్ కొనియాడాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్విట్టర్ వేదికగా సచిన్ తన మనసులో మాటాలను పంచుకున్నాడు. ‘ఇలాంటి మంచి మనసు కల్గిన మనుషుల వల్లే ప్రపంచం అందంగా ఉంది. కొన్ని రోజుల క్రితం నా ప్రాణ స్నేహితురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దేవుని దయవల్ల ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుపడింది. సరైన సమయంలో ట్రాఫిక్ పోలీస్ స్పందించడం ఆమె ప్రాణాలను కాపాడింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఒక ఆటోలో దవాఖాను తరలించడంలో ఆయన సమయస్ఫూర్తి వెలకట్టలేనిది అని ట్వీట్ చేశాడు.