ఐపీఎల్లో ఆసక్తికరమైన పోరుకు వేదిక సిద్ధమైంది. వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ముంబైపై సెంచరీతో అదరగొట్టిన రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ చర్చనీయాంశంగా మారాడు. అందుకే బెంగళూరు కనుక ఈ మ్యాచ్ గెలవాలంటే బట్లర్ను సాధ్యమైనంత తర్వగా పెవిలియన్ చేర్చాలని సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ సూచించాడు.
‘‘జోస్ ది బాస్.. కొన్నిసార్లు అది బట్లర్ రోజు అని నమ్మి బౌలర్లు కూడా అతని బ్యాటింగ్ను ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. కానీ అలాంటి ఆటగాడిని సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుంది. ముంబైపై అతని అత్యుత్తమంగా ఆడాడు. తన టైం తీసుకొని బౌన్స్, పేస్కు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత మైదానం నలుమూలలా అద్భుతమైన షాట్లు ఆడుతూ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు’’ అని మోర్కెల్ అన్నాడు.
ఈ ఐపీఎల్లో తొలి మ్యాచ్లో సూపర్ బ్యాటింగ్ ప్రదర్శన చేసినా.. బౌలింగ్ యూనిట్ విఫలం అవడంతో ఓడిపోయిన బెంగళూరు జట్టు ఆ తర్వాత తేరుకొని కోల్కతాపై విజయం సాధించింది. అయితే రాజస్థాన్ మాత్రం వరుసగా సన్రైజర్స్, ముంబై జట్లను ఓడించి దూసుకెళ్తోంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.