ముంబై: ఓపెనింగ్ బ్యాటర్ సోఫియా డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. లారా వాల్వర్ట్ (68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆష్లే గార్డ్నర్ (41; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సోఫియా సునామీని తలపించింది. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్న చందంగా విజృంభించిన సోఫియా ఒక్క పరుగు తేడాతో డబ్ల్యూపీఎల్లో తొలి సెంచరీ చాన్స్ మిస్ చేసుకుంది. కెప్టెన్ స్మృతి మందన (37) పర్వాలేదనిపించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్కు తొలి పరాజయం ఎదురైంది. ఐదు విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న ముంబై శనివారం తొలి పోరులో 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. హీలీ మాథ్యూస్ (35), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (25), ఇస్ వాంగ్ (32) మినహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. యూపీ బౌలర్లలో ఎకెల్స్టోన్ 3, దీప్తి, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 రన్స్ చేసింది. గ్రేస్ హారిస్ (39), తహిలా (38) రాణించారు.