ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమీపిస్తున్న వేళ ప్రతీ మ్యాచ్ అభిమానులను కట్టిపడేస్తున్నది. గెలిస్తే గానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో జట్లన్నీ తుదికంటా పోరాడుతున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా శతక జోరు కొనసాగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. తనకు బాగా అచ్చొచ్చిన హైదరాబాద్లో కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. హైదరాబాద్ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ శతక గర్జన చేశాడు. నాలుగేండ్ల తర్వాత సెంచరీ ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఆర్సీబీ విజయంలో కీలకమయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్తో కలిసి రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఊఫ్మని ఊదేశాడు. ఈ విజయంతో ప్లేఆఫ్ రేసులో ముందంజ వేసిన ఆర్సీబీ.. గుజరాత్తో ఆఖరి పోరుకు సిద్ధమైంది. మరోవైపు సొంతగడ్డపై కనీసం పరువైనా నిలుపుకుంటుదనుకున్న రైజర్స్ ఆరో ఓటమితో అభిమానులను ఉసూరుమనిపించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్లో మరో సూపర్ మ్యాచ్ అభిమానులను కట్టిపడేసింది. గురువారం కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యఛేదనలో ఆర్సీబీ మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఓపెనర్ విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 100, 12 ఫోర్లు, 4 సిక్స్లు) సూపర్ సెంచరీతో తనకు తిరుగులేదని చాటిచెప్పగా, కెప్టెన్ డుప్లెసిస్ (71) తనదైన ఫామ్తో ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్, నజరాజన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు క్లాసెన్ (51 బంతుల్లో 104, 8ఫోర్లు, 6సిక్స్లు) సెంచరీతో అదరగొట్టాడు. సహచరులు విఫలమైన వేళ తన ఫామ్ను చాటుకుంటూ క్లాసెన్ చెలరేగడంతో రైజర్స్ 20 ఓవర్లలో 186/5 స్కోరు చేసింది. బ్రేస్వెల్ (2/13) రెండు వికెట్లు తీయగా, షాబాజ్, సిరాజ్, హర్షల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈ విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకగా, హైదరాబాద్ (8) ఆఖరి స్థానానికి పరిమితమైంది.
తొలుత టాస్ గెలిచిన బెంగళూరు.. హైదరాబాద్కు బ్యాటింగ్ అప్పగించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను చేజార్చుకున్న రైజర్స్.. సొంతగడ్డపై కనీసం పరువైనా నిలుపుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగింది. లోకల్ హీరో మహమ్మద్ సిరాజ్తో బౌలింగ్ మొదలుపెట్టిన ఆర్సీబీ శుభారంభం కనబరిచింది. దీంతో 28 పరుగులకే హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో మంచి ఫామ్మీదున్న క్లాసెన్ వచ్చి రావడంతోనే తన నైజం ఏంటో చూపెట్టాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ కొట్టిన క్లాసెన్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. పవర్ప్లే ముగిసే సరికి హైదరాబాద్ 2 వికెట్లకు 49 పరుగులు చేసింది. ఓ వైపు క్లాసెన్ బౌండరీలతో దుమ్మురేపితే.. మరో ఎండ్లో కెప్టెన్ మర్క్మ్ (18) చక్కటి సహకారం అందించాడు. చక్కటి ఫామ్ కనబరుస్తూ క్లాసెన్ 24 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. అప్పటి వరకు నింపాదిగా ఆడిన మార్క్మ్.్ర. షాట్ ఆడబోయిన షాబాజ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన బ్రూక్.. క్లాసెన్కు జతకలిశాడు. బ్రూక్ కూడా బ్యాటు ఝులిపించడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ జోరు అందుకుంది. సింగిల్స్ కాకుండా బౌండరీలే లక్ష్యంగా చెలరేగిన క్లాసెన్.. షాబాజ్ బౌలింగ్లో మరోమారు రెండు భారీ సిక్స్లు అరుసుకున్నాడు. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షల్ పటేల్ బౌలింగ్లో కండ్లు చెదిరే సిక్స్తో క్లాసెన్ సూపర్ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. 49 బంతుల్లోనే మూడెంకల స్కోరు అందుకుని ఔరా అనిపించాడు.
4 ఐపీఎల్లో సెంచరీ చేసిన నాలుగో సన్రైజర్స్ బ్యాటర్గా క్లాసెన్ నిలిచాడు. వార్నర్, బెయిర్స్టో, బ్రూక్.. క్లాసెన్ కంటే ముందున్నారు. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ధమాకా
సన్రైజర్స్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచారు. ముఖ్యంగా తనకు బాగా అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో కోహ్లీ కీలక ఇన్నింగ్స్తో కదంతొక్కాడు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి రెండు బంతుల్లో చూడచక్కని బౌండరీలతో జోరు ప్రదర్శించాడు. లీగ్లో సూపర్ ఫామ్మీదున్న డుప్లెసిస్ కూడా కోహ్లీకి జతకలువడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ టాప్గేర్లో దూసుకెళ్లింది. కార్తీక్ త్యాగి వేసిన నాలుగో ఓవర్లో డుప్లెసిస్ హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. బౌలర్ ఎవరైనా బౌండరీలు పక్కా అన్న రీతిలో కోహ్లీ, డుప్లెసిస్ చెలరేగడంతో హైదరాబాద్ ఫీల్డర్లు చేష్టలుడిగిపోయారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆంధ్ర యువ పేసర్ నితీశ్కుమార్రెడ్డి బౌలింగ్లో డుప్లెసిస్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో కోహ్లీ నాలుగు ఫోర్లతో మ్యాచ్ను పూర్తిగా తమ వైపునకు తిప్పుకున్నారు. భువీ బౌలింగ్లో సిక్స్తో సెంచరీ మార్క్ అందుకున్న కోహ్లీ.. మరుసటి బంతికే ఫిలిప్స్ క్యాచ్తో వెనుదిరిగాడు. కోహ్లీ, డుప్లెసిస్ ఔటైనా బెంగళూరు సులువుగా గెలుపు గీత దాటింది.
హైదరాబాద్: 20 ఓవర్లలో 186/5 (క్లాసెన్ 104, బ్రూక్ 27*; బ్రేస్వెల్ 2/13), బెంగళూరు: 19.2 ఓవర్లలో 187/2 (కోహ్లీ 100, డుప్లెసిస్ 71; నటరాజన్ 1/34).