ప్రతి మ్యాచ్లో ఆటగాళ్లను మార్చేందుకు కూడా మేం సిద్ధమే. మా దగ్గర ప్రత్యామ్నాయాలకు కొదవలేదు. తొమ్మిదేండ్లుగా ఐసీసీ ట్రోఫీ నెగ్గలేకపోయామనే విషయం జట్టు సభ్యులందరి మదిలో ఉంది. గతాన్ని పక్కన పెట్టి ముందుకు సాగాలనుకుంటున్నాం.
-రోహిత్, భారత కెప్టెన్
నిరుటి ప్రపంచకప్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలనుకుంటున్న పంతం ఒకరిదైతే.. అదే జోరు కొనసాగిస్తూ కప్పు కొట్టేయాలనుకునే తపన మరొకరిది. బ్యాటింగే బలంగా బరిలోకి దిగుతున్నది ఒకరైతే.. బంతుల్ని బుల్లెట్లలా సంధించేందుకు సిద్ధమవుతున్నది మరొకరు. 22 గజాల పిచ్పై 22 మంది ఆటగాళ్ల మధ్య నేడు జరుగనున్న మహా సంగ్రామానికి మెల్బోర్న్ వేదిక కానుంది. టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమ్ఇండియా అమీతుమీకి రెడీ అయింది.
మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్కే వన్నెతెచ్చే అసలు సిసలు సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో భాగం గా ఆదివారం దాయాది పాకిస్థాన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. పేస్కు స్వర్గధామమైన మెల్బోర్న్ మైదానంలో లక్షమంది ప్రేక్షకుల సమక్షంలో జరుగనున్న మెగావార్ కోసం ఇరు జట్లు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం ఇలాగే పొట్టి ప్రపంచకప్ సూపర్-12 తొలి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఓడి.. ఆ తర్వాత నాకౌట్ దశకు చేరకుండానే వెనుదిరిగిన టీమ్ఇండియా.. ఈ సారి ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని చూస్తున్నది. ఇటీవల ఆసియాకప్లో భార త్, పాక్ రెండు సార్లు ఎదురుపడగా.. చెరో మ్యాచ్లో విజయాలు సాధించాయి. ఎప్పట్లాగే భారత జట్టు బ్యాటింగే బలంగా బరిలోకి దిగుతుండగా.. రోహిత్సేనను పేస్తో దెబ్బతీయాలని పాక్ వ్యూహాలు రచిస్తున్నది. ముఖ్యంగా షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, రవూఫ్తో టీమ్ఇండియా టాపార్డర్కు ముప్పు పొంచి ఉంది. ఐసీసీ టోర్నీ ల్లో మెరుగైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లీతో పాటు రోహిత్, రాహుల్, సూర్యకుమార్ కలిసికట్టుగా కదం తొక్కితే.. భారత్కు తిరుగుండదు.
మెల్బోర్న్ పిచ్ పేస్కు సహకరించనుంది. ఆదివారం వర్షం పడే అవకాశాలను కొట్టిపారేయలేం. టాస్ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గు చూపనుంది. మైదానం పెద్దది కావడంతో భారీ షాట్లు ఆడటం కాస్త కష్టమే.
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్య, పాండ్యా, కార్తీక్, అక్షర్, భువనేశ్వర్, షమీ, అర్శ్దీప్, చాహల్/అశ్విన్.
పాకిస్థాన్: బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, మసూద్, హైదర్, ఇఫ్తిఖార్, ఆసిఫ్, నవాజ్, షాదాబ్, నసీమ్, షాహీన్ అఫ్రిది, రవుఫ్.