తరోబా: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక అండర్-19 ప్రపంచ కప్టోర్నీలో హైదరాబాద్ యువ క్రికెటర్ రిషిత్రెడ్డి రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఐర్లాండ్తో మ్యాచ్కు ముందు నాయక ద్వయం యష్ ధుల్, షేక్ రషీద్ సహా ఐదుగురు ప్లేయర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో బరిలోకి దిగిన టీమ్ఇండియా..ఐర్లాండ్పై ఘన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మెగాటోర్నీలో మిగతా మ్యాచ్లను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ శుక్రవారం ఐదుగురు ప్లేయర్లను రిజర్వ్గా ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాదీ స్పీడ్స్టర్ రిషిత్ రెడ్డితో పాటు ఉదయ్ సహారణ్(రాజస్థాన్), అభిషేక్ పోరెల్(బెంగాల్), అన్ష్ గోసాయి(సౌరాష్ట్ర), పుష్పేంద్రసింగ్ రాథోడ్(రాజస్థాన్) ఉన్నారు. శనివారం వెస్టిండీస్కు బయల్దేరి వెళ్లనున్న వీరు ఆరు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉండనున్నారు. టోర్నీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో శనివారం పసికూన ఉగాండాతో యువ భారత్ తలపడనుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లో అద్భుత విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా..చివరి మ్యాచ్లోనూ సత్తాచాటాలని చూస్తున్నది. ఐర్లాండ్తో మ్యాచ్లో సమిష్టిగా రాణించిన కుర్రాళ్లు..ఉగాండాపై భారీ విజయంతో నాకౌట్లోకి వెళ్లాలని చూస్తున్నారు. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటములు ఎదుర్కొన్న ఉగాండా..కనీసం పోటీనివ్వాలన్న ఆలోచనతో ఉంది.