టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచులో పంత్ సెంచరీ చేయడం ద్వారా ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ లో కూడా సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు.
ఇంగ్లండ్ తో కొద్దిరోజుల క్రితమే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో పంత్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 90 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన దశలో రవీంద్ర జడేజా తో కలిసి రెండు వందలకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు పంత్. ఇక ఆదివారం నాటి వన్డేలో కూడా 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో హార్ధిక్ పాండ్యాతో కలిసి 133 పరుగులు జోడించాడు. ఫలితంగా భారత్ మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా చేజిక్కించుకుంది. ఈ రెండు సందర్భాలలో భారత్ కు అవసరమున్న సమయంలోనే పంత్ సెంచరీలతో చెలరేగడం విశేషం.
ఇంగ్లండ్ పై టెస్టులతో పాటు వన్డేలలో కూడా సెంచరీలు చేసిన జాబితాలో గతంలో శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర కూడా ఉన్నాడు. సంగక్కర టెస్టులలో ఇంగ్లండ్ పై రెండు సెంచరీలు, రెండు వన్డే శతకాలు బాదాడు. కానీ టెస్టులలో అతడు సెంచరీలు చేసినప్పుడు ప్రసన్న జయవర్దెనే వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో టెస్టులలో అతడు చేసిన సెంచరీలు కేవలం ఆటగాడిగా చేసినట్టుగానే నమోదయ్యాయి.
ఇదిలాఉండగా తన తొలి వన్డే సెంచరీ చేసిన పంత్ ఆదివారం నాటి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ ఇన్నింగ్స్ ను నా జీవితాంతం గుర్తుంచుకుంటా. వన్డేలలో ఇదే నా తొలి సెంచరీ. అదీ జట్టు కష్టాలలో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం వల్ల వచ్చే కిక్ వేరేగా ఉంటుంది..’ అని అన్నాడు.