Renuka Singh Thakur : దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత పేసర్ రేణుకా సింగ్ రికార్డు క్రియేట్ చేసింది. పొట్టి ప్రపంచకప్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన టీమిండియా బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కింది. శనివారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో రేణుక ఐదు వికెట్లు తీసింది. నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చింది.
ఇంతకుముందు ఈ రికార్డు ప్రియాంకా రాయ్ పేరు మీద ఉంది. 2009 ప్రపంచకప్లో ప్రియాంక పాకిస్థాన్పై ఐదు వికెట్ల ప్రదర్శన చేసింది. అయితే.. ఆమె 3.5 ఓవర్లలో 16 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసింది. 15 రన్స్కే ఐదు వికెట్లు తీసిన రేణుక, ప్రియాంక రికార్డును బ్రేక్ చేసింది.
గ్రూప్ -2 నాకౌట్ పోరులో టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ను రేణుకా సింగ్ హడలెత్తించింది. పవర్ ప్లేలో మూడు వికెట్లు పడగొట్టింది. తొలి ఓవర్ మూడో బంతికి ఓపెనర్ వ్యాట్ను ఔట్ చేసింది. అప్పటికే షాక్లో ఉన్న ఇంగ్లండ్ను తన రెండో ఓవర్లో మళ్లీ దెబ్బ కొట్టింది. క్యాప్సేను బౌల్డ్ చేసింది. మూడో ఓవర్లో డంక్లేను బౌల్డ్ చేసి ఆ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. 19వ ఓవర్లో నాలుగో బంతికి అమీ జోన్స్ను వెనక్కి పంపింది. ఆ తర్వాత బంతికే క్యాథెరిన్ సీవర్ బ్రంట్ను ఔట్ చేసి హ్యాట్రిక్పై నిలిచింది. అయితే.. చివరి బంతికి బైస్ రూపంలో నాలుగు పరుగులు వచ్చాయి. దాంతో రేణుక హ్యాట్రిక్ మిస్ అయింది.