Ravi Shastri : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టు కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఇరుజట్లలో స్పిన్నర్లు కీలకం కానున్నారు. దాంతో, టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ సీరీస్లో చెలరేగుతాడని, అతను సిరీస్ ఫలితాన్ని నిర్ణయించగలడని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ‘భారత్కు అశ్విన్ చాలా కీలకం. అతను చెలరేగితే భారత్ సిరీస్ గెలవడం ఖాయం. విదేశాల్లో కూడా అశ్విన్ నంబర్ వన్ స్పిన్నర్గా నిరూపించుకున్నాడు. స్వదేశంలో అతను మరింత ప్రమాదకరం. బంతి టర్న్ అయి, పిచ్ నుంచి సహకారం లభిస్తే చాలు ఈ ఆఫ్ స్పిన్నర్ ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. అయతే.. అతను తన ప్రణాళికలకు కట్టుబడి ఉంటే సరిపోతుంది’ అని శాస్త్రి తెలిపాడు.
మూడో స్పిన్నర్గా చైనామన్
భారత్కు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అయితే.. మూడో స్పిన్నర్గా చైనామన్ కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలని రవిశాస్త్రి సూచించాడు. అందుకు కారణం ఏంటో కూడా చెప్పాడు. ‘రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బౌలింగ్ దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ, కుల్దీప్ మాత్రం భిన్నంగా బంతులు వేస్తాడు. ఒకవేళ ఇండియా టాస్ ఓడిపోతే వికెట్లు తీసేందుకు కుల్దీప్ లాంటి బౌలర్ కావాలి. ఎందుకుంటే.. మొదటి రోజు బంతిని టర్న్ చేసేది కుల్దీప్ మాత్రమే’ అని మాజీ కోచ్ వెల్లడించాడు. భారత్, ఆసీస్ మధ్య మొదటి టెస్టు నాగ్పూర్లో ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది.