హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వార్షిక అవార్డుల కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. మంగళవారం స్థానిక స్టార్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో టీమ్ఇండియా క్రికెటర్లు తళుక్కుమన్నారు. గత కొన్నేండ్లుగా అంతర్జాతీయ ఫార్మాట్లో అదరగొడుతున్న యువ క్రికెటర్ల తోపాటు దేశ క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపుగా పలువురిని బోర్డు తగిన రీతిలో సత్కరించింది.
ప్రతిష్ఠాత్మక కల్నల్ సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, ఫారుఖ్ ఇంజినీర్కు దక్కాయి. 2022-23 ఏడాది పాలీ ఉమిగ్రర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును శుభ్మన్ గిల్ సొంతం చేసుకున్నాడు. బుమ్రా(2021-22), అశ్విన్(2020-21), షమీ(2019-20) అవార్డులు సొంతం చేసుకున్నారు. అత్యుత్తమ మహిళా క్రికెటర్లుగా దీప్తిశర్మ, స్మృతి మందన నిలిచారు.