కోల్కతా: ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్లో బెంగాల్ తడబడింది. సౌరాష్ట్ర పేసర్ల ధాటికి బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులకే ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (69), అభిషేక్ పొరెల్ (50) అర్ధశతకాలు సాధించగా.. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో జైదేవ్ ఉనాద్కట్, చేతన్ సకారియా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర గురువారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. హర్విక్ దేశాయ్ (38), చేతన్ సకారియా (2) క్రీజులో ఉన్నారు. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న సౌరాష్ట్ర.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 93 పరుగులు వెనుకబడి ఉంది.