Ramiz Raja : భారత జట్టు యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా ప్రశంసలు కురిపించాడు. అతను మినీ రోహిత్ శర్మలా కనిపిస్తున్నాడని అతను అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్పై తొలి వన్డేలో గిల్ డబుల్ సెంచరీ సాధించడంతో రమీజ్ అతడిని హిట్మ్యాన్తో పోల్చాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘శుభ్మన్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అతనిలో చాలా సామర్థ్యం ఉంది. దూకుడుగా ఆడడం అలవర్చుకున్నాడు. తొలి వన్డేలో అతని బ్యాటింగ్ టెక్నిక్ రోహిత్ను గుర్తు చేసింది. గిల్ బ్యాటింగ్ శైలిని ఏమాత్రం మార్చుకోవాల్సిన అవసరం లేదు’ అని రమీజ్ తెలిపాడు. హైదరాబాద్లో జరిగిన తొలి వన్డేలో శుభ్మన్ గిల్ ధనాధన్ బ్యాటింగ్తో ద్విశతకం బాదాడు. దాంతో, అతి చిన్న వయసు (23)లో డబుల్ సెంచరీ బాదిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
అంతేకాదు రెండో వన్డేలో అర్థశతకం చేసిన రోహిత్ను కూడా పీసీబీ మాజీ చీఫ్ అభినందించాడు. ‘కివీస్ బ్యాటర్లు తడబడిన అదే పిచ్పై రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు అలవోకగా బ్యాటింగ్ చేసింది. అందుకు కారణం విధ్వసంక ఓపెనర్ రోహిత్ శర్మ లాంటి ఆటగాడు ఉండడమే. అతను హుక్, పుల్ షాట్లు ఆడడంలో దిట్ట. దాంతో, 109 పరుగుల టార్గెట్ను సులువుగా ఛేదించింది’ అని రమీజ్ అన్నాడు. భారత పేసర్లు విజృంభించడంతో కివీస్ 108 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేదనలో రోహిత్ 51, గిల్ 40 రన్స్ చేయడంతో ఇండియా 20.1 ఓవర్లోనే మ్యాచ్ ముగించింది. 2-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకోవడమే కాకుండా వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి చేరింది. నామమాత్రమైన మూడో వన్డే జనవరి 24న ఇండోర్లో జరుగుతుంది.