PCB Chairman : వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్కప్ను పాకిస్థాన్ బాయికాట్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా స్పందించాడు. బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ.. తమ దేశంలో 2023 ఆసియా కప్ నిర్వహించకుండా అడ్డుపడితే వన్డే వరల్డ్ కప్లో ఆడబోమని రమీజ్ స్పష్టం చేశాడు. ‘ఒకవేళ భద్రతా కారణాల దృష్ట్యా భారత పర్యటనకు పాక్ను ప్రభుత్వం అనుమతించకపోతే? అయినా బీసీసీఐ ముందుగా ఆ వివాదాన్ని మొదలు పెట్టింది. మేము స్పందించాల్సి ఉంది అని వ్యాఖ్యానించాడు. టీ 20 వరల్డ్ కప్లో పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూశారుగా. 90 వేల మంది ప్రేక్షకులు వచ్చారు. క్రికెట్లో బ్యాటు, బంతి మాత్రమే మాట్లాడుతాయి’ అని రమీజ్ తెలిపాడు. టీ 20 గ్రూప్ మ్యాచ్లో భారతజట్టు, పాకిస్థాన్పై అద్భుత విజయం సాధించింది.
అంతేకాదు రాజకీయాలతో సంబంధం లేకుండా భారత్, పాకిస్థాన్ పర్యటనకు రావాలని, టెస్ట్ మ్యాచ్లు ఆడాలని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. అందుకు ఫిఫా వరల్డ్కప్ను ఉదాహరణగా చెప్పాడు. ఫిఫా వరల్డ్ కప్లో ఇరాన్, అమెరికా తలపడుతున్నాయి. ఇరాన్లో మహిళల హక్కులు, హిజాబ్తో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. అయినా కూడా ఆ జట్టు ఫుట్బాల్ ఆడుతోంది. ఆట వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని రమీజ్ రాజా తెలిపాడు.
2023 ఆసియా టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, భారత జట్టు ఆసియా కప్లో ఆడేందుకు పాకిస్థాన్ వెళ్తుందా? లేదా? అనే అనుమానాలకు బీసీసీఐ కార్యదర్శి జై షా తెరదించాడు. భారత్ పాక్ గడ్డపై కాలుపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. అంతేకాదు అవసరమైతే ఆసియా కప్ వేదికను మారుస్తామని జై షా వెల్లడించాడు. పాక్ క్రికెట్ బోర్డు, మాజీలు జై షా నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఒకవేళ అదే జరిగితే.. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న వన్డే వరల్డ్కప్ను బాయికాట్ చేస్తామని పాక్ హెచ్చరించింది.