Ramiz Raja : ఇంగ్లండ్తో జరుగుతున్నమూడు టెస్టుల సిరీస్లో పాకిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైంది. రెండో టెస్ట్లో విజయం సాధించే అవకాశం ఉన్నా పాక్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దాంతో మొదటి రెండు టెస్టుల్లో నెగ్గిన ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజాపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు పీసీబీ బాస్ అయిన నిజమ్ సేథీ మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నాడని సమాచారం. ఈమధ్యే లాహోర్లో జరిగిన ఒక ఫంక్షన్లో పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ను నిజం సేథీ కలిశాడు. దాంతో, పీసీబీ అధ్యక్షుడి పదవి కోసమే అతను ప్రధానిని కలిశాడనే వదంతలు వ్యాపించాయి. ఈ విషయాన్ని పీసీబీ మాజీ సభ్యుడు ఒకరు ధ్రువీకరించాడు. ‘అవును నిజమే. ఏదో ఒకటి కచ్చితంగా జరగనుంది. లాహోర్ ఫంక్షన్లో ప్రధానిని కలిసిన నిజం సేథీ, పీసీబీ ఛైర్మన్గా రమీజ్ స్థానాన్ని భర్తీ చేయొచ్చు’ అని ఆ అధికారి తెలిపాడు.
పీసీబీ అధ్యక్షుడిని నామినేట్ చేసే అధికారం పాక్ ప్రధానికి ఉంది. దాంతో వాళ్లు సిఫారసు చేసిన వ్యక్తి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అవుతాడు. పాక్ మాజీ క్రికెటర్ అయిన రమీజ్ రాజా 2021 సెప్టెంబర్లో పీసీబీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టాడు. పీసీబీ చీఫ్ పదవికి అతడిని పేరును పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫారసు చేశాడు. 2018 సేథీ తన పదవికి రాజీనామా చేశాడు.
ఇండియా, పాక్ క్రికెట్ పెద్దల మధ్య 2023 ఆసియా కప్ వివాదం నేపథ్యంలో రమీజ్ రాజా వార్తల్లో నిలిచాడు. వచ్చే ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్లో జరగనుంది. అయితే.. పాక్ గడ్డపై భారత జట్టు కాలు మోపే అవకాశమే లేదని, అవసరమైతే వేదికను మారుస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించిన సంగతి తెలిసిందే. దాంతో, ఆసియా కప్ నిర్వహించే హక్కులు తమ దేశానికే ఉండాలని రమీజ్ రాజా పలుమార్లు మీడియాలో చెప్పాడు. ఒకవేళ అదే జరిగితే తాము భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్ కప్లో ఆడబోమని రాజా స్పష్టం చేశాడు.