IPL 2023 : కొచ్చిలో జరుగుతున్న ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ కళ్లు చెదిరే ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అటగాడిగా రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు సొంతం చేసుకుంది. టీ 20 వరల్డ్ కప్లో అదరగొట్టిన అతను వేలంలో 16 కోట్ల నుంచి 17 కోట్లకు అమ్ముడుపోతాడని అందరూ ఊహించారు. ఈసారి వేలంలో భారీ ధర పలికిన సామ్ కరన్పై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణియం బద్రినాథ్ అభినందిస్తూ ట్వీట్ చేశాడు. రికార్డు బద్ధలు కొట్టాడు. అతని పెరట్లో నోట్ల వర్షం కురుస్తోంది. అందుకు అతను అర్హుడే అంటూ ఆసక్తికర కామెంట్ రాశాడు. బద్రినాథ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విదర్భ జట్టుకు కెప్టెన్. తమిళనాడు తరఫున కూడా ఆడాడు. ఐపీఎల్లో బద్రినాథ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీల తరఫున ఆడాడు.
2021లో జరిగిన మినీ ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ అత్యధిక ధర పలికాడు. రూ. 16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ అతడిని కొనుగోలు చేసింది. మోరిస్ రికార్డును సామ్ కరన్ బ్రేక్ చేశాడు. వెన్నెముక గాయం కారణంగా పోయిన ఏడాది వేలానికి దూరమైన సామ్ కరన్ ఈసారి ఫ్రాంఛైజీల ఫస్ట్ ఛాయిస్గా నిలిచాడు. అందుకు కారణం.. టీ 20 వరల్డ్ కప్లో అతను అద్భుత ప్రదర్శన చేశాడు. పాక్తో జరిగిన ఫైనల్లో కీలకమైన 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు.
Record broken, Raining currencies in Sam Curran’s garden..deservedly so.. #IPLAuction
— S.Badrinath (@s_badrinath) December 23, 2022