న్యూఢిల్లీ: యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ టీమ్ఇండియా బెంచ్ బలాన్ని పెంచిన భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్.. హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్గా కొనసాగుతూ.. అండర్-19, భారత్-‘ఎ’ ఆటగాళ్లకు మెరుగులు అద్దుతున్న ద్రవిడ్ టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్గా నియమితుడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఐపీఎల్ ఫైనల్ను ప్రత్యక్షంగా వీక్షించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా.. ఈ అంశంపై ద్రవిడ్తో సంప్రదింపులు జరిపినట్లు బోర్డు అధికారి తెలిపారు. గత ఆరేండ్లుగా యువ ఆటగాళ్లకు శిక్షకుడిగా కొనసాగుతున్న ద్రవిడ్.. ఎందరో మెరికల్లాంటి ఆటగాళ్లను జాతీయ జట్టుకు అందించాడు. రిషబ్ పంత్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారి, శుభ్మన్ గిల్, శివం మావి, అవేశ్ ఖాన్ వంటి వాళ్లంతా మిస్టర్ డిపెండబుల్ వద్ద మెళకువలు నేర్చుకున్నవారే. ప్రస్తుతం కోచ్గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి గడువు టీ20 ప్రపంచకప్తో ముగియనుండగా.. అతడి నుంచి బాధ్యతలు తీసుకునేందుకు ద్రవిడ్ అంగీకరించినట్లు సమాచారం. దీనిపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. ‘ఏం జరుగుతున్నదో నాకు తెలియదు. ఈ విషయమై ఎవరితో చర్చించలేదు’ అని అన్నాడు. మరోవైపు బౌలింగ్ కోచ్గా పారస్ మాంబ్రే పేరు బలంగా వినిపిస్తున్నది. అయితే లోథా కమిటీ సిఫరసుల ప్రకారం క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) ద్వారా ఇంటర్వ్యూ అనంతరమే ద్రవిడ్ అధికారికంగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.