టెన్నిస్ దిగ్గజం, 20సార్లు గ్రాండ్స్లామ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాబోయే వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2021, టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, మరికొన్నేండ్ల పాటు కెరీర్ను కొనసాగించడంపై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. నాదల్ 2008, 2010లో రెండుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు. 2008లో టెన్నిస్ మెన్స్ సింగిల్స్ విభాగంలో ఒలింపిక్ స్వర్ణం సాధించాడు.
‘అందరికీ హాయ్, ఈ ఏడాది జరిగే వింబుల్డన్ ఛాంపియన్షిప్, టోక్యో వేదిగా నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం ఏమీ కాదు. కానీ, నా శరీరం సహకరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకొని నా బృందంతో చర్చించిన తర్వాత, ఇదే సరైన నిర్ణయమని భావించానని’ ట్విటర్లో పేర్కొన్నాడు.
సుదీర్ఘకాలం కెరీర్ను కొనసాగించడం, అలాగే నాకు సంతోషాన్ని కలిగించే పనులను చేయడమే తన లక్ష్యమన్నాడు. వృత్తిపరమైన, వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం కోసం అత్యున్నతస్థాయిలో కష్టపడాలనుకుంటున్నట్లు స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్ వివరించాడు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా బ్రిటన్, జపాన్లోని నా అభిమానులకు ప్రత్యేక సందేశం పంపాలనుకుంటున్నానని వరుస ట్వీట్లు చేశాడు.