న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం లక్ష్యసేన్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్కు దూసుకెళ్లారు. కరోనా విజృంభణ మధ్య కొనసాగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో శుక్రవారం టాప్ సీడ్ సింధు 21-7, 21-18తో భారత్కే చెందిన అశ్మిత చాలిహపై విజయం సాధించింది. 36 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో అశ్మిత పోరాడినా.. ప్రపంచ మాజీ చాంపియన్ ముందు ఎక్కువసేపు నిలువలేకపోయింది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ 14-21, 21-9, 21-14తో హెచ్ఎస్ ప్రణయ్పై గెలిచాడు. మహిళల మరో క్వార్టర్స్లో ఆకర్షి కశ్యప్ 21-12, 21-15తో మాళవిక బన్సోద్పై గెలిచి ముందంజ వేస్తే.. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ సెమీస్కు చేరింది.
ఫోర్బ్స్ ఏడో ర్యాంక్లో
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు..ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. ఇటీవల తాజాగా విడుదల చేసిన లిస్ట్లో ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్లలో సింధు టాప్-10లో చోటు దక్కించుకుంది. ఈ ఫీట్ అందుకున్న ఏకైక భారత అథ్లెట్గా ఈ యువ షట్లర్ నిచిలింది. అడ్వైర్టెజింగ్ ఎండార్స్మెంట్లతో పాటు టోర్నీల్లో ప్రైజ్మనీ ద్వారా సింధు రూ.51.87 కోట్లు సంపాదించింది. జాబితాలో జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా రూ.424 కోట్లతో టాప్లో ఉండగా, సెరెనా (రూ.340 కోట్లు), వీనస్ (రూ.83 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.