బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పుణెరీ పల్టన్ ఏడో విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పల్టన్ 44-38తో యూపీ యోధాపై విజయం సాధించింది. పుణెరీ పల్టన్ తరఫున మోహిత్ 14 పాయింట్లతో విజృంభించగా.. అస్లమ్ ఇమాన్దార్ 12 పాయింట్లతో సత్తాచాటాడు. యూపీ యోధా తరఫున స్టార్ రైడర్, డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ (6 పాయింట్లు) విఫలం కాగా.. సురేందర్ గిల్ (16 పాయింట్లు) తుదికంటా పోరాడినా ఫలితం లేకపోయింది. ప్రస్తుత సీజన్లో 14 మ్యాచ్లాడి ఏడింట ఓడి.. ఏడు గెలిచిన పల్టన్ 37 పాయింట్లతో పట్టికలో 8వ స్థానంలో ఉండగా.. 40 పాయింట్లు ఖాతాలో ఉన్న యూపీ యోధా ఏడో ప్లేస్లో కొనసాగుతున్నది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఒకే వేదికగా కట్టుదిట్టమైన బయోబబుల్లో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ లీగ్లో పలువురికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కాగా.. మరిన్ని జాగ్రత్తల మధ్య మ్యాచ్లు కొనసాగిస్తున్నారు. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం బెంగళూరు బుల్స్ (46) టాప్లో ఉండగా.. దబంగ్ ఢిల్లీ (43), హర్యానా స్టీలర్స్ (42) ఆ తర్వాత వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ 14 మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్క గెలుపుతో పట్టిక అట్టడుగున నిలిచింది. శుక్రవారం జరుగనున్న పోరులో పట్నా పైరెట్స్తో తమిళ్ తలైవాస్ తలపడనుంది.