వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగల ప్లేయర్లు కోకొల్లలు. గ్రామీణ ప్రతిభను వెలికితీయాలన్న ఉద్దేశంతో పురుడు పోసుకున్న క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(క్యాట్) మరో కొత్త కాన్సెప్ట్తో ముందుకువచ్చింది. విలేజ్ టు వరల్డ్కప్ అనే నినాదంతో ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్బీసీ)ను ఏర్పాటు చేసింది.
దేశంలో ఎక్కడ లేని రీతిలో వినూత్న శైలిలో ఐఎస్బీసీ ద్వారా 766 జిల్లాల నుంచి ప్రతిభ కల్గిన ప్లేయర్లను అన్వేషిస్తున్నది. 12 నుంచి 16 ఏండ్ల వయసు ఉన్న పిల్లలు సత్తాచాటేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఉచిత శిబిరాల ద్వారా మెరికల్లాగాతీర్చిదిద్దేందుకు మంచి విజన్తో ముందుకెళుతున్నది. అవినీతిలో కొట్టుమిట్టాడుతున్న హెచ్సీఏ తాము ప్రత్యామ్నాయం అంటున్న క్యాట్ వ్యవస్థాపక కార్యదర్శి సునీల్బాబుతో
నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ
గ్రామీణ ప్రతిభకు మీరందించే ప్రోత్సాహం?
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(క్యాట్) మొదలైంది. దశాబ్దం క్రితం ప్రారంభమైన క్యాట్ అంచలంచెలుగా ఎదుగుతున్నది. పాఠశాల స్థాయి క్రికెట్ను దేశానికి పరిచయం చేసిందే క్యాట్ అని గర్వంగా చెప్పదల్చుకున్నాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) కేవలం రాష్ట్ర రాజధానికే పరిమితమైన వేళ క్యాట్ నలువైపులా విస్తరిస్తున్నది. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామీణ ప్రాంత పిల్లలకు ఉచిత శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నాం.
ఐఎస్బీసీ ముఖ్య ఉద్దేశమేంటి?
ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ఐఎస్బీసీ) ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావడమే. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే..గ్రామీణ ప్రాంతాల్లో ప్లేయర్లకు సరైన వసతులు ఉండవు. ఈ కారణంగా ప్రతిభ ఉండి కూడా కొంత మంది ప్లేయర్లు బయటికి రాలేకపోతున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుంటూ ఐఎస్బీసీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏ పాఠశాలలో చదివే విద్యార్థి అయినా క్రికెట్లో రాణించేందుకు వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నాం. ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదని నిరూపిస్తూ వారికి నాణ్యమైన శిక్షణతో పాటు మంచి ఆహారం అందిస్తున్నాం.
ప్లేయర్లను ఎలా ఎంపిక చేస్తారు?
రాష్ట్రంలో 12 నుంచి 16 ఏండ్ల లోపు వయసు ఉన్న పిల్లలు తాము ఆడుతున్న నిమిషం నిడివి గల వీడియోను ఐఎస్బీసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఇలా వచ్చిన వీడియోలను దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో ఉన్న ఐఎస్బీసీ నిపుణులు పరిశీలించి వారిని శిక్షణా శిబిరాలకు ఎంపిక చేస్తారు. ఇందులో దేశ వ్యాప్తంగా 766 జిల్లాలకు చెందిన ప్లేయర్లు భాగం కాబోతున్నారు. తొలుత గ్రామ స్థాయి నుంచి మొదలై మండలం, జిల్లా, రాష్ట్రం, జోనల్ నుంచి దేశ స్థాయికి ఎంపిక చేస్తాం. మొదట తెలంగాణనే మోడల్గా తీసుకుంటున్నాం.
క్యాంప్ల నిర్వహణ ఎలా ఉంటుంది?
ప్రతీ జిల్లా కేంద్రంలో ఉచిత, శాశ్వత ప్రాతిపదికన శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకెళుతున్నాం. శిబిరాల ద్వారా ఓవైపు ప్లేయర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు కోచింగ్, సహాయక సిబ్బందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. దేశ వ్యాప్తంగా 766 జిల్లాల్లో 400 క్రికెట్ క్యాంప్ల ద్వారా 306,400 మంది క్రికెటర్లు పాలుపంచుకుంటుండగా, 15,200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి భాగస్వామ్యంపై?
తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి..ఐఎస్బీసీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. చరిత్రాత్మక సినిమాల ద్వారా తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించిన రాజమౌళికి క్రికెట్పై ఆయనకున్న ఆసక్తికి తోడు గ్రామీణ ప్రాంత ప్లేయర్లకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు. ఆయన సలహాలు, సూచనలతో భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం.
స్కూల్స్ వరల్డ్కప్ నిర్వహణ ఎలా?
వచ్చే ఏడాది జనవరిలో భారత్ వేదికగా స్కూల్స్ వరల్డ్ కప్ నిర్వహిస్తున్నాం. ఈ మెగా టోర్నీలో ఆతిథ్య భారత్ సహా ఎనిమిది దేశాలు పోటీపడుతాయి. దేశంలో తొలిసారి నిర్వహించబోతున్న ఈ టోర్నీకి బీసీసీఐ సహకారమందిస్తున్నది. మొత్తం ఎనిమిది జట్లు మెగాటోర్నీలో బరిలోకి దిగుతాయి.