Prithvi Shaw | భారత యువ క్రికెటర్ పృథ్వీషా ఆట కంటే వివాదాలతోనే వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. కెరీర్ తొలినాళ్లలో తన అద్భుత ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ ముంబైకర్ రానురాను వివాదస్పదంగా మారుతున్నాడు. అంచనాలకు అనుగుణంగా రాణించడంలో విఫలమవుతూ అక్కరలేని విషయాల్లో కలుగజేసుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న పృథ్వీ, మోడల్ నిధి తపాడియా మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్లు తెలుస్తున్నది.
ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్లో తళుక్కుమన్న ఈ జోడీ బ్రేకప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వాలైంటైన్స్ డే సందర్భంగా నిధి తన కాబోయే భార్యగా సంబోధిస్తూ పోస్ట్ చేసిన షా ఆ తర్వాత డిలీట్ చేశాడు. అయితే ఇద్దరి మధ్య ఏర్పడిన పొరపచ్చాలతో విడిపోయేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో కావడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది. మొత్తానికి పృథ్వీషా, నిధి మధ్య బంధం మళ్లీ కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు.
ఇదంతా ఒకవైపు అయితే తన అద్భుత నైపుణ్యంతో అండర్-19 ప్రపంచకప్లో భారత్ను విజేతగా నిలిచిన పృథ్వీషా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారాడు. ఈ మధ్యే ముంబైలో నడిరొడ్డుపై సోషల్మీడియా పాపులర్ సప్నగిల్తో గొడవ పడటం షా కెరీర్కు ప్రతిబంధకంగా నిలిచింది. దీనికి తోడు ఫిట్నెస్ సమస్యలు టీమిండియా నుంచి దూరం చేసింది. సహచర క్రికెటర్ శుభ్మన్గిల్ అన్ని ఫార్మాట్లలో కీలకంగా మారిన వేళ పృథ్వీషా చేజేతులా తన కెరీర్ను నాశనం చేసుకుంటున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎనిమిది మ్యాచ్లాడిన షా 106 పరుగులకే పరిమితమయ్యాడు. కోచ్ రికీ పాంటింగ్ అంచనాలు ఏ మాత్రం అందుకోలేకపోయిన షా..జట్టుకు భారంగా మారిపోయాడు. ఇకనైనా వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టి ఆటపై మనసు పెడుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది.