మహాబలిపురం: ఓవైపు బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ సంబురానికి తెరలేవబోతుంటే..సరిగ్గా అదే సమయానికి భారత్లో ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్ సమరానికి వేళయైంది. గురువారం నుంచి మహాబలిపురం వేదికగా 44వ చెస్ ఒలింపియాడ్ అట్టహాసంగా మొదలుకాబోతున్నది. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న మెగాటోర్నీలో మొత్తం 350 జట్లు బరిలోకి దిగుతున్నాయి. రష్యా, చైనా గైర్హాజరీలో ఆతిథ్య భారత్ ఆరేసి జట్లతో (ఓపెన్, మహిళల) 30 మందిని పోటీకి దించుతున్నది. ఓపెన్ విభాగంలో 188 జట్లు, మహిళల కేటగిరీలో162 టీమ్స్ పోటీకి సై అంటున్నాయి. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈసారి మెంటార్గా యువ ప్లేయర్లకు దిశా నిర్దేశం చేయబోతున్నాడు. సుదీర్ఘ ఒలింపియాడ్ చరిత్రలో ఇన్ని జట్లు పాల్గొనడం ఇది తొలిసారి కావడం విశేషం.
స్విస్ లీగ్ ఫార్మాట్లో: చెస్ ఒలింపియాడ్ స్విస్ లీగ్ ఫార్మాట్లో జరుగనుంది. మొత్తం 11 రౌండ్ల పాటు పోటీలు జరుగుతాయి. తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్లేయర్లకు స్వర్ణ, రజత, కాంస్యాలు లభిస్తాయి. దీనికి తోడు ఓపెన్ సెక్షన్లో విజేతకు హామిల్టన్-రస్సెల్ కప్, మహిళల విభాగంలో వెరా మెన్చిక్ కప్, సంయుక్త కేటగిరీలో అగ్రస్థానంలో నిలచిన వారికి నోనా గాప్రిదశ్విలీ ట్రోఫీ అందించనున్నారు. గేమ్లన్నీ మహాబలిపురంలోని హోటల్ షెరటాన్లో జరుగుతాయి.
పోటీలో అర్జున్: రెండో సీడ్గా బరిలోకి దిగుతున్న భారత్ తరఫున తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్తో పాటు హరికృష్ణ, విదిత్ గుజరాతి, నారాయణన్, శశికిరణ్ ఉన్నారు. ఈసారి భారత్ కచ్చితంగా పసిడి పతకం నెగ్గుతుందన్న భారీ అంచనాలు ఉన్నాయి. మహిళల విభాగానికొస్తే టాప్సీడ్ భారత్ ‘ఎ’ తరఫున హంపి, హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి ఉన్నారు. ఉక్రెయిన్, జార్జియా, కజకిస్థాన్ నుంచి భారత్కు పోటీ ఎదురయ్యే అవకాశముంది.
ట్రోమ్సో(నార్వే)లో 2014లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత్కు కాంస్య పతకం లభించింది.
2020లో జరిగిన ఆన్లైన్ ఒలింపియాడ్లో రష్యాతో కలిసి భారత్ సంయుక్త విజేతగా నిలిచింది.
2021 చెస్ ఒలింపియాడ్లో భారత్కు కాంస్య పతకం దక్కింది.