న్యూఢిల్లీ: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టును ఒకప్పుడు కింగ్స్ లెవన్ పంజాబ్ అని పిలిచేవారు. ఆ జట్టుకు ఓనర్ ప్రీతి జింతా(Preity Zinta). అయితే ఇటీవల స్టార్స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో ప్రీతి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది. తమ జట్టు ప్లేయర్ల కోసం 120 పరోటాలు చేసినట్లు గుర్తు చేసింది. స్టార్ స్పోర్ట్స్ యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. అబ్బాయిలు ఇంతలా తినంటారన్న విషయం తనకు అప్పుడే తెలిసిందన్నారు. అయితే ఆ షో సమయంలో అక్కడే ఉన్న క్రికెటర్ హర్భజన్ నవ్వేశాడు.
2009లో ఐపీఎల్ సౌతాఫ్రికాలో జరిగింది. అక్కడ తమ ప్లేయర్లకు మంచి పరోటాలు దొరకలేదని, పరోటాలు చేయడం మీకు నేర్పిస్తానని ప్రీతి అన్నారు. అయితే తమకు ఆలూ పరోటాలు కావాలని ప్లేయర్లు అడిగారని, వచ్చే మ్యాచ్ గెలిస్తే పరోటాలు చేసి ఇస్తానని ప్రీతి హామీ ఇచ్చింది. ఇక పంజాబీ జట్టు ఆ మ్యాచ్ను నెగ్గింది. దీంతో ప్రీతి స్వయంగా 120 పరోటాలు చేసిన ప్లేయర్లకు ఇచ్చింది. ప్రీతి ఇచ్చిన సమాధానం విన్న హర్భజన్.. ఇర్ఫాన్ పఠాన్ ఒక్కడే 20 పరోటాలు తిన్నట్లు చెప్పాడు.