హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఉప్పల్ స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో పసికూన నెదర్లాండ్స్పై పాక్ ఘన విజయం సాధించింది. తొలుత రిజ్వాన్, సౌద్ షకీల్ అర్ధసెంచరీలతో పోరాడే స్కోరు అందుకున్న పాక్.. ఆ తర్వాత డచ్ పని పట్టింది. రవూఫ్, అలీ నిప్పులు చెరిగే పేస్తో డచ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. విక్రమ్జీత్సింగ్, డీ లీడే పోరాడినా.. సహచరుల నుంచి సరైన సహకారం లేకపోవడంతో సాధ్యం కాలేదు. మొత్తంగా ఉప్పల్ స్టేడియంలో తొలిసారి జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ అభిమానులను అలరించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన తమ తొలి మ్యాచ్లో పాక్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత మహమ్మద్ రిజ్వాన్ (75 బంతుల్లో 68, 8ఫోర్లు), సౌద్ షకీల్ (52 బంతుల్లో 68, 9ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు. టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనా వీరిద్దరు కలిసి సాధికారిక ఇన్నింగ్స్తో జట్టుకు పోరాడే స్కోరు కట్టబెట్టారు. బాస్ డీ లీడే (4/62), అకర్మన్ (2/39) రాణించారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన డచ్ జట్టు 41 ఓవర్లలో 205 పరుగులకు కుప్పకూలింది. విక్రమ్జీత్సింగ్ (67 బంతుల్లో 52, 4ఫోర్లు, సిక్స్), డీ లీడే (68 బంతుల్లో 67, 6ఫోర్లు, 2సిక్స్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. హరిస్ రవూఫ్ (3/43), హసన్ అలీ (2/33) రాణించారు. షకీల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్.. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి వేదికైంది. సరిగ్గా 27 ఏండ్ల తర్వాత హైదరాబాద్లో ప్రపంచకప్ మ్యాచ్ జరిగింది. శుక్రవారం ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. చివరిసారిగా నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో జింబాబ్వే, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 16, 1996లో వరల్డ్కప్ మ్యాచ్ జరిగింది. ఇందులో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే 2011, 2016లో మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యమిచ్చినప్పటికీ హైదరాబాద్ ఆతిథ్య హోదా దక్కించుకోలేకపోయింది. హైదరాబాద్లో ప్రస్తుతం జరుగుతున్న మెగాటోర్నీ కోసం రాచకొండ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1500 మంది పోలీసులను మ్యాచ్ కోసం మోహరించారు.
అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో వేదికల సౌకర్యాల విషయంలో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. పుష్కర కాలం తర్వాత తొలిసారి వరల్డ్కప్నకు పూర్తిస్థాయిలో ఆతిథ్యమిస్తున్న బీసీసీఐ.. ఏర్పాట్ల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా (సామర్థ్యం పరంగా) పేరొందిన అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో స్టాండ్లలో నెలకొన్న పరిస్థితులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సౌకర్యాల వైఫల్యం మరువక ముందే మోదీ స్టేడియంలో అపరిశుభ్ర పరిస్థితులపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే ఇంగ్లం డ్, న్యూజిలాండ్ తొలి మ్యాచ్కు ప్రేక్షకులు కరువై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐపై మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ఇప్పుడు ఫ్యాన్స్.. సోషల్మీడియాలో బోర్డును ఆడుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తనయుడు జైషా ఆధ్వర్యంలో జరుగుతున్న మెగాటోర్నీలో ఆదిలోనే విమర్శలు రావడం ఒక రకంగా బీసీసీఐ ప్రతిష్టను మసకబారుస్తున్నదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య గురువారం జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా మోదీ స్టేడియంలో సీట్లు అపరిశుభ్రంగా ఉండటం తాజాగా వెలుగులోకి వచ్చింది. కనీసం కూర్చుకునేందుకు వీలు లేకుండా స్టేడియంలోని కుర్చీలు ఏర్పాటు చేయడంపై ఫ్యాన్స్ సోషల్మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 49 ఓవర్లలో 286 ఆలౌట్ (రిజ్వాన్ 68, షకీల్ 68, డీ లీడే 4/62, అకెర్మన్ 2/39),
నెదర్లాండ్స్: 41 ఓవర్లలో 205(విక్రమ్జీత్సింగ్ 52, డీ లీడే 67, రవూఫ్ 3/43, అలీ 2/33)