అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా విరాజిల్లుతున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్ లో ఎంత చెబితే అంత అని పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అన్నాడు. ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ఏం చెబితే అది జరిగి తీరుతుందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ కోసం ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) క్యాలెండర్ లో భాగంగా రెండున్నర నెలల పాటు ప్రత్యేకంగా షెడ్యూల్ కేటాయించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో అఫ్రిది స్పందించాడు.
సామా టీవీ షోలో అఫ్రిది స్పందిస్తూ.. ‘మార్కెట్ వ్యూహాలు, ఎకానమీలో ఇదంతా భాగం. క్రికెట్ ప్రపంచంలో ఇండియాకు అతి పెద్ద మార్కెట్ ఉంది. కావున వాళ్లు ఏం చెబితే అది జరిగి తీరుతుంది..’ అని వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ మీడియా హక్కుల (2023-27) ద్వారా రూ. 48 వేల కోట్లకు పైగా ఆర్జించిన బీసీసీఐ వచ్చే సీజన్ నుంచి రెండున్నర నెలల పాటు ఈ క్యాష్ రిచ్ లీగ్ ను నిర్వహించాలని చూస్తున్నది. ఈ మేరకు ఐసీసీతో కలిసి చర్చలు జరుపుతున్నది. అయితే ఈ ప్రతిపాదనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఐసీసీ గనక బీసీసీఐ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేస్తే తాము నిండా మునుగుతామని అంటున్నది.
ఐపీఎల్ ను రెండున్నర నెలలు నిర్వహిస్తే ద్వైపాక్షిక సిరీస్ ల మీద తీవ్ర ప్రభావం పడుతుందని పీసీబీ కొత్త రాగం అందుకుంది. దీనిమీద ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.