Salman Bhatt : న్యూజిలాండ్పై మూడో టీ20లో మెరుపు సెంచరీ బాదిన భారత ఓపెనర్ శుభ్మన్ గిల్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ ప్రశంసలు కురిపించాడు. శుభ్మన్ గిల్ బ్యాటింగ్ తనకు టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ మ్యాచ్ చూసిన అనుభూతి ఇచ్చిందని అతను అన్నాడు. అంతేకాదు ఈ యంగ్ ఓపెనర్ టెక్నిక్ విషయంలో ఇషాన్ కిషన్ కంటే మెరుగ్గా ఉన్నాడని భట్ అభిప్రాయపడ్డాడు. ‘మూడో టీ20లో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ రోజర్ ఫెదరర్ టెన్నిస్ ఆటలాగ సాగింది. మెరుపు వేగంతో అతను షాట్లు ఆడాడు. అతను పెద్దగా కష్టపడకుండానే బౌండరీలు కొట్టాడు. ప్రస్తుత రోజుల్లో రాంప్ షాట్స్, పవర్ హిట్టింగ్ వంటివి పాపులర్. కానీ, గిల్ న్యూజిలాండ్పై మామూలు క్రికెట్ షాట్లతోనే చెలరేగాడు’ అని భట్ తెలిపాడు.
అంతేకాదు.. భారత జట్టు క్రికెట్ నైపుణ్యాన్ని కొనియాడాడు. శుభ్మన్ గిల్ టీమిండియా గొప్ప ఆటగాడు అవుతాడని జోస్యం చెప్పాడు. అప్పట్లో సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున అద్భుత ఇన్నింగ్స్లు ఆడాడు. ఇప్పడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. గిల్ కూడా వీళ్ల బాటలోనే పయనిస్తున్నాడు. అందుకనే భారత క్రికెట్ వ్యవస్థను మెచ్చుకుంటున్నా అని సల్మాన్ భట్ తెలిపాడు.
ఇషాన్ వైఫల్యానికి కారణం..
మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ టెక్నిక్ గురించి కూడా భట్ ప్రస్తావించాడు. ‘టెక్నిక్ సమస్య వల్ల ఇషాన్ విమర్శల పాలవుతున్నాడు. అయితే.. అతను గత మ్యాచుల్లో ఉత్తమంగా రాణించాడు. పరుగులు సాధిస్తే టెక్నిక్ అనేది ఏమంత సమస్య కాదు. అయినా ప్రతి ఒక్క ఆటగాడికి టెక్నిక్ సమస్యలు లేదా ఇతర లోపాలు ఉంటాయి. అతను భయం లేకుండా ఆడతాడు. రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటాడు’ అని ఈ పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో గిల్ సిక్స్లు, ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. 54 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దాంతో, భారత్ 234 రన్స్ చేసింది. కివీస్ 66కే ఆలౌట్ కావడంతో ఇండియా 168 పరుగుల తేడాతో గెలిచింది.