ఖలీల్వాడి, మే 19: ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ బిడ్డ సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక టైటిల్ గెలిచిన తొలి తెలుగు మహిళగా నిలిచింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నిఖత్ జరీన్ (25) ప్రపంచ చాంపియన్గా కొత్త చరిత్ర సృష్టించింది. 52 కిలోల విభాగంలో పోటీ పడిన నిఖత్.. ఫైనల్లో థాయ్లాండ్కు చెందిన జిట్పాంగ్ను ఓడించింది.
జిల్లా కేంద్రానికి చెందిన ఎండీ జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కూతురు అయిన నిఖత్ జరీన్ 1996 జూన్ 14న జన్మించింది. పదో తరగతి వరకు నిజామాబాద్లోని నిర్మల హృదయ హైస్కూల్లో చదివిన ఆమె కాకతీయ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. 15 ఏండ్ల వయస్సులోనే బాక్సింగ్ ప్రాక్టీస్ ప్రారంభించిన ఆమెకు తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభించింది. దిగ్గజ మేరీకోమ్ను స్ఫూర్తిగా తీసుకున్న నిఖత్.. బాక్సింగ్ చాంపియన్గా నిలవాలనే తపనతో కష్టపడింది. హైదరాబాద్లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్లో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ లెవల్ బాక్సింగ్ పోటీల్లో చాంపియన్గా నిలిచింది. 2011లో జరిగి ఉమెన్స్ యూత్ జూనియర్ చాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఎక్కడ బాక్సింగ్ పోటీలు జరిగినా కచ్చితంగా పతకం ఒడిసి పట్టుకోవడం అలవాటుగా చేసుకుంది. గత ఫిబ్రవరి నెలలో బల్గేరియాలో జరిగిన 73వ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ పోటీల్లోనూ స్వర్ణ పతకం సాధించింది. నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్గా నిలవడంతో ఇందూరు జిల్లా మురిసిపోయింది. ఆమె విజయం సాధించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
నిఖత్ జరీన్ అంతర్జాతీయ వేదికలపై తన బాక్సింగ్ పంచ్లతో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నది. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆమె.. ‘అడిడాస్’కు బ్రాండ్ అంబాసిడర్గా 2018లో ఒప్పందం చేసుకుంది.