హైదరాబాద్, ఆట ప్రతినిధి: గాడియం స్కూల్ వేదికగా ముగిసిన సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో నిషా అగర్వాల్ ఆల్రౌండ్ చాంపియన్గా నిలిచింది. పోటీలకు ఆఖరిరోజైన మంగళవారం జరిగిన మహిళల అండర్-17 అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో నిషా 42.90 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకంతో మెరిసింది. ఆమని దిల్షాద్(41.80), నారాయణి మధుసూదన్(37.75)వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మరోవైపు అండర్-19 ఆల్రౌండ్ విభాగంలో కోమల్ దాకె విజేతగా నిలిచింది. సవర్ణి శర్మ, భవ్య జైన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పోటీల ముగింపు కార్యక్రమానికి బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.