హైదరాబాద్, ఆట ప్రతినిధి: నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నీసా), సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక అథ్లెటిక్స్ మీట్ శనివారం అట్టహాసంగా ముగిసాయి. హకీంపేటలోని నీసా అకాడమీలో మూడు రోజుల పాటు జరిగిన అథ్లెటిక్స్ టోర్నీలో 62 మంది అసిస్టెంట్ కమాండెంట్ ఆఫీసర్ ట్రైనీలు వివిధ క్రీడాంశాల్లో తలపడ్డారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అశిష్ గలియాన్, భూమికా వర్షిణి ఓవరాల్ విజేతలుగా ట్రోఫీలను కైవసం చేసుకున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ షట్లర్ పీవీ సింధు పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘టోర్నీలో పాల్గొన్న అందరికీ అభినందనలు. ఆటలో గెలుపు, ఓటములు సహజం. కచ్చితంగా సాధించగలమన్న నమ్మకం మనపై మనకుంటే విజయాలు వాటంతట అవే వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆత్మైస్థెర్యం కోల్పోకుండా ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు’ అని అంది. ఈ కార్యక్రమంలో సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను నీసా డైరెక్టర్ సీవీ ఆనంద్ ఘనంగా సన్మానించారు.