NewZealand | అండర్ డాగ్స్గా వరల్డ్కప్లో అడుగుపెట్టి.. తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను మట్టికరిపించిన న్యూజిలాండ్ ఇప్పుడు ఒక్క విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నది. మరీ ముఖ్యంగా పాకిస్థాన్తో పోరులో ఆ జట్టు నాలుగొందల పై చిలుకు స్కోరు చేసినా.. చివరికి పరాజయం వైపు నిలువాల్సి వచ్చింది. ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ జట్టుకు ఇదే (401/6) అత్యధిక స్కోరు కాగా.. ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా వర్షం కారణంగా పాకిస్థాన్ చేతిలో పరాజయం తప్పలేదు. వరల్డ్కప్లో ఓ జట్టు 400 పరుగులు చేసిన తర్వాత ఓడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఓవరాల్గా చూసుకుంటే.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ న్యూజిలాండ్ ప్రమాదకర జట్టే. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలింగ్ను తుత్తునియాలు చేసి 36.2 ఓవర్లలోనే ఇంగ్లిష్ జట్టు విసిరిన లక్ష్యాన్ని (283) ఛేదించిన న్యూజిలాండ్.. ప్రత్యర్థులకు ప్రమాద హెచ్చరికలు పంపింది. అదే ఊపులో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్పై కివీస్ ఏకపక్ష విజయాలు సాధించింది. అటు బ్యాటింగ్లో దంచికొట్టడం.. ఆ తర్వాత బౌలర్లు సమిష్టిగా రాణించి ప్రత్యర్థిని దెబ్బకొట్టడం ఇది ఆనవాయితీగా కొనసాగింది. ఫలితంగా ఆడిన తొలి నాలుగు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించిన బ్లాక్ క్యాప్ సెమీస్ రేసులో ముందు వరుసలో నిలిచింది.
నాలుగు విజయాలతో దూకుడు మీద ఉన్న కివీస్ను టీమ్ఇండియా దెబ్బకొట్టింది. గత వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతికారం తీర్చుకుంటూ చెలరేగిపోయిన రోహిత్సేన.. కివీస్ను నేలకు దించింది. అప్పటి వరకు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత పేసర్ మహమ్మద్ షమీ.. న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. ఐదు వికెట్లతో అదరగొట్టి కివీస్ను 273 పరుగులకు పరిమితం చేశాడు. ఇక చేజింగ్లో విరాట్ కోహ్లీ (95) సూపర్ ఇన్నింగ్స్కు రోహిత్ అయ్యర్ మెరుపులు తోడవడంతో భారత్ మరో రెండు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఆ ఒక్క పరాజయంతో కివీస్ కుదేలైంది.
లీగ్ దశలో ప్రతి జట్టు తొమ్మిది మ్యాచ్లు ఆడాల్సిన మెగాటోర్నీలో ఒక టీమ్.. వరుసగా నాలుగు మ్యాచ్లు నెగ్గి ఆ తర్వాత ఒక పరాజయం ఎదుర్కోవడం అనేది పెద్ద విషయమేం కాదు. ఆ తర్వాత తిరిగి కోలుకుంటే.. ఈ పాటికి ఎప్పుడో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారయ్యేది. కానీ టీమ్ఇండియా చేతిలో ఓటమి ఆ జట్టును మరీ కుంగదీసింది. ఎంతలా అంటే.. ఆ తర్వాత ఆ జట్టు అసలు గెలుపు బాట పట్టలేకపోయింది. ప్రతి మ్యాచ్లో ఎంతో ప్రయత్నిస్తున్నా.. అదృష్టం మాత్రం న్యూజిలాండ్ గడప తొక్కడం లేదు.
భారత్ చేతిలో భంగ పడ్డ న్యూజిలాండ్ ఆ తర్వాత.. వరుసగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ చేతిలో ఓడింది. అందులో ముఖ్యంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ గురించ చెప్పుకోవాలి. మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు 388 పరుగులు చేస్తే.. ఛేదనలో రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత పోరాటంతో ఒక దశలో కివీస్ విజయం ఖాయమే అనిపించినా.. చివర్లో ఒత్తిడికి చితెన కివీస్ 383 పరుగులకు పరిమితమై 6 రన్స్ తేడాతో ఓటమి చవిచూసింది. ఇక పాకిస్థాన్తో పోరులో అయితే మరీ ఘోరం.. మొదట బ్యాటింగ్ చేస్తూ నాలుగొందల పైచిలుకు పరుగులు చేసినా.. ఆ జట్టు గెలుపు రుచి చూడలేకపోయింది. వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకున్న కివీస్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంలో పడేసుకుంది.