New Zealand Test Team : ‘పోరాడితే పోయేది ఏమి లేదు.. బానిస సంకెళ్లు తప్ప’. ఈ జగమెరిగిన నానుడిని న్యూజిలాండ్ (New Zealand ) క్రికెట్ జట్టు బాగా ఒంటపట్టించుకుంది. సమిష్టిగా రాణించిన కివీస్ రెండేళ్ల క్రితం భారత్ను ఓడించి టెస్టు చాంపియన్షిప్ (WTC) గదను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టీ20ల హోరులో అంతకంతకు ప్రాభవం కోల్పోతున్న టెస్టు ఫార్మాట్లో ఉన్న మజా ఏంటో అభిమానులకు కివీస్ రుచిచూపిస్తోంది. పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్న న్యూజిలాండ్ ఐదు రోజుల ఆటలో చిరస్మరణీయ విజయాలు సాధిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే.. గెలుపే లక్ష్యంగా ఆ జట్టు సాగిస్తున్న జైత్రయాత్రకు అభిమానులంతా ఫిదా అవుతున్నారు. నిన్నగాక మొన్న సొంతగడ్డపై ఇంగ్లండ్ను కంగు తినిపించిన కివీస్.. తాజాగా లంకేయుల భరతం పట్టింది.
క్రైస్ట్చర్చ్లో హోరాహోరీగా జరిగిన తొలి టెస్టులో ఆఖరి బంతికి న్యూజిలాండ్దే పైచేయి అయ్యింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒంటరి పోరాటం ఆ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టింది. దాంతో.. రెండు టెస్టుల సిరీస్లో గెలిచి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించాలనుకున్న లంకేయుల ఆశలపై కివీస్ నీళ్లు గుమ్మరించింది. న్యూజిలాండ్ అద్భుత విజయంతో భారత్కు మార్గం సుగమమైంది. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడయింలో జూన్ 7న ఆస్ట్రేలియా, భారత్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది.
ఫిబ్రవరి 28, మార్చి 13.. ఈ రెండు తేదీలు న్యూజిలాండ్ క్రికెట్లో చరిత్రాత్మక రోజులు అని చెప్పవచ్చు. సుదీర్ఘ చరిత్ర కల్గిన టెస్టు ఫార్మాట్లో కివీస్ నూతన అధ్యాయం లిఖించిన సందర్భాలు ఇవి. పోరాటతత్వాన్ని అణువణువున జీర్ణించుకున్న కివీస్ సొంతగడ్డపై చరిత్రాత్మక విజయాలతో తమకు తామే సాటి అని నిరూపించుకుంది. శ్రీలంకతో తొలి టెస్టు ఆఖరి రోజు ఓవైపు వరుణుడు అంతరాయం కలిగించినా వెరవకుండా ఆ జట్టు కడదాకా పోరాడిన తీరు ప్రతీ అభిమానికి చిరకాలం గుర్తుండిపోతుంది. లంక నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 28/1తో ఆఖరి రోజు బరిలోకి దిగింది. ఎడతెరిపిలేని వర్షంతో తొలి రెండు సెషన్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక మ్యాచ్ జరగడం అసాధ్యం అనుకుంటున్న తరుణంలో వర్షం తెరిపినివ్వడంతో న్యూజిలాండ్కు ప్రాణం లేచివచ్చింది.
చిత్తడిగా మారిన మైదానంలో విలియమ్సన్ లంక బౌలింగ్ దాడిని సమర్థంగా తిప్పికొట్టాడు. లక్ష్యాన్ని అంతకంతకు కరిగించుకుంటూ పోయాడు. ఎలాగైనా మ్యాచ్ గెలువాలన్న పట్టుదలతో విలియమ్సన్, డారెల్ మిచెల్ ఆడారు. ఆఖరి ఓవర్లో విజయానికి ఏడు పరుగులు అవసరమైన దశలో తొలి బంతికి విలియమ్సన్ సింగిల్ తీయగా, మరుసటి బంతికి మ్యాట్ హెన్రీ పరుగు తీశాడు. మూడో బంతికి హెన్రీ రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో లంకేయులు గెలుపు తమదే అనుకున్నారు. కానీ, నాలుగో బంతిని కేన్ ఫోర్గా మలిచాడు. అసితా ఫెర్నాండో ఐదో బంతిని బౌన్సర్ సంధించాడు.
కివీస్ గెలవాలంటే.. ఆఖరి బంతికి ఒక పరుగు కావాలి. బైస్ కింద విలియమ్సన్ పరుగు అందుకోగా, ఫెర్నాండో గురి చూసి వికెట్లను గిరాటేశాడు. దీంతో రనౌట్ అయ్యాడని అనుకున్నారంతా. కానీ, రిప్లేలో విలియమ్సన్ అంతకుముందే క్రీజులోకి చేరుకోవడంతో కివీస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లండ్తో మ్యాచ్లోనూ ఆఖరి బంతికి విజయాన్నందుకున్న న్యూజిలాండ్ .. నెల రోజుల్లోపే అదే రీతిలో మరో విజయాన్ని సొంతం చేసుకుని ఔరా అనిపించింది. మొత్తంగా టెస్టు క్రికెట్కు ఇంకా భూమి మీద నూకలు మిగిలే ఉన్నాయని ఈ రెండు సందర్భాలు నిరూపించాయి.