New Jersy for Team India | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్ వేదికగా ఆదివారం నుంచి టీ-20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానున్నది. ఈ టోర్నీలో టీమ్ఇండియా ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో ఆడనున్నారు. ఈ జెర్సీలను టీం ఇండియా పురుషులు, మహిళా జట్ల స్పాన్సరర్ ఎంపీల్ స్పోర్ట్స్ ఆవిష్కరించింది. కొత్త జెర్సీ డార్క్ బ్లూ కలర్లో లభిస్తుంది. క్రికెట్ అభిమానులే స్ఫూర్తిగా దీన్ని రూపొందించామని బీసీసీఐ తెలిపింది.
‘అభిమానుల గుర్తుగా జెర్సీని రూపొందించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. గత మేటి మ్యాచ్ల సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలు, హర్షధ్వానాలు జెర్సీపై ఉంటాయి’ అని ఎంపీల్ స్పోర్ట్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. టీ-20 ప్రపంచకప్ 2021లో టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీ చిత్రాలను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫాపై బుధవారం రాత్రి ప్రదర్శించారు. జెర్సీ విడుదల వీడియోను కూడా దానిపై ప్రదర్శించారు.
ముఖ్యంగా బుర్జ్ ఖలీఫాపై కోహ్లీ, రోహిత్, జడేజా ఫొటోలు తళుక్కున మెరిశాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలైంది. గతేడాది కూడా ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ చిత్రాన్ని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభంలో కోల్కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను సైతం దీనిపై ప్రదర్శించారు. టీ-20 వరల్డ్ కప్ టోర్నీలో ఈ నెల 24న టీం ఇండియా తన దాయాది దేశం పాక్తో తలపడనున్నది.