సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): అతనో జాతీయస్థాయి కరాటే చాంపియన్. తన శిక్షణలో ఎంతో మంది చిన్నారులు, యువతీ యువకులను కరాటేలో మెరికల్లాగా తీర్చిదిద్దాడు. ఆయన శిష్యరికంలో ఎంతో మంది చాంపియన్లుగా తయారయ్యారు. ఆత్మరక్షణ విద్యలో ఆరితేరారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తన తర్ఫీదుతో అందరి గురువుగా మారిన ఆయన ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కరోనా వైరస్ బారిన పడిన అతను మరెవరో కాదు నగరానికి చెందిన సంతోష్ మొహతె. ఈ ఏడాది ఏప్రిల్లో 43 ఏండ్ల సంతోష్కు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో చేర్పించారు. అయితే వైద్యులు.. పలు పరీక్షలు చేసి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని నిర్ధారించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రతి రోజు దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతున్న నేపథ్యంలో అంత భరించే శక్తి తమ కుటుంబానికి లేదని సంతోష్ భార్య ఆవేదనతో చెప్పుకొచ్చింది. ‘చికిత్స కోసం ఇప్పటికే డబ్బులన్నీ ఖర్చు చేశాం. పరిస్థితి దయనీయంగా ఉంది. నా భర్తను బతికించండి. ఆయన లేకపోతే మేమందరం అనాథలమవుతాం. విద్యార్థులు మాస్టర్ ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. వాళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నాను. మీకు తోచిన సాయం చేయండి. మీకు చేతులెత్తి మొక్కుతున్నా’ అని కన్నీటి పర్యంతమైంది. ఇదిలా ఉంటే వైద్య ఖర్చుల కోసం డబ్బులు సమకూర్చేందుకు ‘ఇంపాక్ట్ఫండ్గురు’ వేదికగా సాయం కోసం వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు ముందుకొస్తే..కుటుంబాన్ని ఆదుకున్న వారవుతారని ప్రాధేయపడుతున్నారు.