అహ్మదాబాద్/జూబ్లీహిల్స్,అక్టోబర్6: జాతీయ క్రీడల్లో తెలంగాణ ప్లేయర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటి వరకు మనవాళ్లు మొత్తం 18 పతకాలు (7 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలు) ఖాతాలో వేసుకొని పట్టికలో 14వ స్థానంలో కొనసాగు తున్నారు. గురువారం మహిళల బాస్కెట్బాల్లో మన అమ్మాయిలు పసిడి పతకం కైవసం చేసుకున్నారు. మహిళల 5X5 ఫైనల్లో తెలంగాణ 67-62తో తమిళనాడుపై విజయం సాధించింది. అంతకుముందు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో మన అమ్మాయిలు 88-82తో కేరళను చిత్తుచేశారు.
36వ నేషనల్ గేమ్స్ బాస్కెట్బాల్లో తెలంగాణ మహిళలకు ఇది రెండో బంగారు పతకం కావడం విశేషం. ఇప్పటికే 3X3 విభాగంలో పసిడి కొల్లగొట్టిన మన అమ్మాయిలు 5X5లోనూ సేమ్ సీన్ రిపీట్ చేశారు. జాతీయ పోటీల్లో తెలంగాణ జట్లకు రెండు స్వర్ణాలు దక్కడం చాలా ఆనందంగా ఉందని కోచ్ సొహైల్ ఖాన్ తెలిపారు. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బాస్కెట్బాల్ కోచ్ గా వ్యవహరిస్తున్న సొహైల్ ఖాన్ ప్లేయర్లను అభినందించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గులాబ్ షా, అంజుశ్రీ, ప్రియాంక, అశ్వితి థంపితో పాటు టోర్నీ బెస్ట్ ప్లేయర్ పుష్ప అంతర్జాతీయ క్రీడలకు ఎంపికైనట్లు తెలిపారు.
సిక్కిరెడ్డి పసిడి వెలుగులు
ఇప్పటికే టీమ్ఈవెంట్లో స్వర్ణం కైవసం చేసుకున్న తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ విజృంభించింది. పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ విజేతగా నిలువగా.. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-గాయత్రి గోపీచంద్ జోడీ పసిడి పతకం చేజిక్కించుకుంది. పురుషుల ఫైనల్లో సాయిప్రణీత్ 21-11, 12-21, 21-16తో మిథున్ మంజునాథ్ (కర్ణాటక)పై విజయం సాధించాడు. తొలి గేమ్ను సునాయాసంగా చేజిక్కించుకున్న ప్రణీత్.. రెండో గేమ్లో ఓటమి పాలైనా.. హోరాహోరీగా సాగిన నిర్ణయాత్మక మూడో పోరులో సత్తాచాటాడు. అంతకుముందు మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి-గాయత్రి గోపీచంద్ జోడీ 21-14, 21-11తో అశ్విని భట్-శిఖ గౌతమ్ (కర్ణాటక)పై గెలుపొందింది.
వ్రితి అగర్వాల్ డబుల్ ధమాకా
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్.. నేషనల్ గేమ్స్లో మరో రెండు పతకాలు ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజతం చేజిక్కించుకున్న వ్రితి.. బుధవారం 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో కాంస్య పతకంతో మెరిసింది.