తెలంగాణ నుంచి మరో క్రీడాతార అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమైంది. జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తూ పతకాల పంట పండిస్తున్న గురుకుల తేజం అగసర నందిని తన కెరీర్లో కీలక టోర్నీకి సై అంటున్నది. కెన్యా వేదికగా త్వరలో మొదలవుతున్న ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నందిని బరిలోకి దిగుతున్నది. తెలంగాణ నుంచి తొలిసారి మెగాటోర్నీలో పోటీపడుతున్న అరుదైన రికార్డు సొంతం చేసుకున్న నందిని పతకంతో తిరిగొస్తానని ధీమా వ్యక్తం చేసింది. శనివారం నైరోబీకి బయల్దేరిన ఈ యువ స్ప్రింటర్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడింది.
రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల ఫలాలు చేతికి అందివస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన గురుకుల విద్యాసంస్థలు అద్భుత ఫలితాలనిస్తున్నాయి. సోసైటీలో పిల్లలు చదువులోనే కాదు క్రీడల్లోనూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. తాము ఎంచుక్నున క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి నందిని తొలి అంతర్జాతీయస్థాయి టోర్నీలో పోటీ పడబోతున్నది. ఈ సందర్భంగా ఆమె తన లక్ష్యాలేంటో వివరించింది.
చాంపియన్షిప్లో పోటీ ఎవరి నుంచి?
నైరోబీ వేదికగా ఈనెల 17 నుంచి మొదలయ్యే అండర్-20 ప్రపంచ జూనియర్ టోర్నీలో నాకు ప్రధానంగా జమైకా అథ్లెట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశముంది. ప్రస్తుతం 100మీటర్ల హర్డిల్స్లో 13.70సెకన్ల టైమింగ్ నమోదు చేస్తున్నా. కచ్చితంగా పతకం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసం నాకుంది.
గురుకుల సోసైటీ సహకారం ఎలా ఉంది?
శిక్షణ, సదుపాయాల విషయంలో ప్రభుత్వం, గురుకుల సోసైటీ నుంచి మంచి మద్దతు లభిస్తున్నది. అత్యుత్తమ శిక్షణ సౌకర్యాలు అందించడంలో సోసైటీ చాలా సహకరిస్తున్నది. మెగాటోర్నీకి తొలిసారి వెళుతున్నావు..పతకంతో తిరిగిరావాలని సోసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్ సార్ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. దీనికి తోడు గచ్చిబౌలి స్టేడియంలో సాయ్ గోపీచంద్ మైత్రా వారి సహకారంతో కావాల్సిన డైట్, టోర్నీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చును అందిస్తున్నారు.
ఆసియా గేమ్స్కు అర్హత సాధిస్తావా?
మెగా టోర్నీలో పతకం సాధించడం ద్వారా వచ్చే ఏడాది జరిగే ఆసియా గేమ్స్కు అర్హత సాధించే అవకాశముంది. హర్డిల్స్లో మెరుగైన ప్రదర్శనతో పోడియం ఫినిష్ చేస్తానన్న గట్టి నమ్మకం నాకుంది. నేను ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టం మరువలేనిది.