Anjali Devi : భారత క్వార్టర్ మిలెర్ అంజలీ దేవీ(Anjali Devi)కి భారీ షాక్ తగిలింది. డోప్ పరీక్ష(Dope Test)లో పట్టుబడిన ఆమెపై జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ(NADA) ఏకంగా నాలుగేండ్ల నిషేధం విధించింది. హర్యానాకు చెందిన అంజలి.. నిరుడు జూన్లో నిర్వహించిన డోప్ పరీక్షలో ఫెయిల్ అయింది. ఆమె రక్త నమూనాను పరీక్షించగా నిషేధిత జీడబ్ల్యూ 1516 (GW1516) డ్రగ్ పాజిటివ్ వచ్చింది.
అంతర్జాతీయ డ్రగ్ నిరోధక ఏజెన్సీ నిషేధిత జాబితాలో ఉన్న ఆ డ్రగ్ను ఉపయోగించినందున అంజలిపై నాడా కఠిన చర్యలు తీసుకుంది. నాలుగేండ్ల పాటు అన్ని రకాల పోటీల్లో పాల్గొనకుండా ఆమెపై సస్పెన్షన్ విధించింది.
అంజలీ దేవీ
నిరుడు భువనేశ్వర్లో జరిగిన ఇంటర్ స్టేట్ నేషనల్స్ అంజలి అదరగొట్టింది. 400 మీటర్ల రీలె పరుగులో 51.48 సెకన్లలో గమ్య స్థానానికి చేరి బంగారు పతకం సాధించింది. దాంతో, ఆసియా క్రీడలకు క్వాలిఫై అయింది. అంతేకాదు 400 మీటర్ల పరుగులో హర్యానాకే చెందిన నిర్మలా షొరాన్(Nirmala Sheoran) తర్వాత వేగంగా పరుగెత్తిన ఆరో భారత అథ్లెట్గా 25 ఏండ్ల అంజలి రికార్డు నెలకొల్పింది. 2019లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లోనూ అంజలి పోటీ పడింది. ఈమధ్యే నిర్మలా షొరాన్పై నాడా ఎనిమిదేండ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే.