MI VS RCB | 120 బంతుల్లో 197. టీ20లలో ఇదేం కాపాడుకోలేనంత తక్కువ లక్ష్యమేమి కాదు. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్ల పుణ్యమా అని ఈ భారీ ఛేదనను ముంబై ఇండియన్స్ 93 బంతుల్లోనే ఊదేసింది. క్రీజులోకి వచ్చిన బ్యాటర్ కొడితే సిక్స్ లేకుంటే ఫోర్ అన్న రేంజ్లో విధ్వంసరచన చేస్తూ అరేబియా సముద్రపు తీరాన పరుగుల వరద పారించారు. బెంగళూరు బౌలింగ్ యూనిట్ను నెట్ బౌలర్లుగా మారుస్తూ ఇషాన్, సూర్య కొట్టిన కొట్టుడుకు అంత భారీ లక్ష్యం ఏమాత్రమూ సరిపోలేదు. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా డుప్లెసిస్, పాటిదార్, కార్తీక్ మెరుపులతో ఆర్సీబీ భారీ స్కోరు చేసినా ఆ జట్టు మరోమారు ఓటమి వైపే నిలిచింది. ఈ సీజన్లో ముంబైకి ఇది రెండో గెలుపు కాగా ఆర్సీబీకి ఐదో ఓటమి.
IPL | ముంబై: ఐపీఎల్-17లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఢిల్లీ మ్యాచ్తో విజయాల బాట పట్టిన ముంబై ఇండియన్స్ సొంత ఇలాఖా వాంఖడేలో మరోసారి విజయగర్జన చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని మరో 27 బంతులు మిగిలుండగానే ‘ఉఫ్’మని ఊదేసింది. బౌలింగ్లో స్పీడ్గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్ల (5/21)తో చెలరేగితే బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 69, 7 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చితక్కొట్టడంతో ముంబై 15.3 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. కెప్టెన్ డుప్లెసిస్ (40 బంతుల్లో 61, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 53 నాటౌట్, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆర్సీబీ ఇన్నింగ్స్ ఒడిదొడుకులతోనే మొదలైంది. ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ (3)ని బుమ్రా మూడో ఓవర్లోనే ఔట్ చేయడంతో బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. తొలి మ్యాచ్ ఆడుతున్న విల్ జాక్స్ (8) రెండు ఫోర్లు కొట్టినా ఆకాశ్ మధ్వాల్ 4వ ఓవర్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చాడు. 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని డుప్లెసిస్, పాటిదార్ నిలబెట్టారు. ఈ ఇద్దరూ వికెట్ కాపాడుకుంటూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటించారు. గెరాల్డ్ కొయెట్జ్ వేసిన 12వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన పాటిదార్.. 25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. కోహ్లీ కాకుండా ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున తొలి ఫిఫ్టీ చేసిన బ్యాటర్ అతడే. కానీ ఆ ఓవర్లో మరుసటి బంతికే పాటిదార్.. ఇషాన్కు క్యాచ్ ఇవ్వడంతో 82 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రజత్ స్థానంలో వచ్చిన మ్యాక్స్వెల్ మరోసారి సున్నా చుట్టాడు. ఆఖర్లో కార్తీక్ దుమ్మురేపాడు. ముంబై బౌలర్లను ఉతికి ఆరేస్తూ కార్తీక్ 22 బంతుల్లోనే 50 ప్తూ చేయడంతో ఆర్సీబీకి భారీ స్కోరు దక్కింది.
భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఆదినుంచే విరుచుకుపడింది. అంతంతమాత్రంగానే ఉన్న ఆర్సీబీ బౌలర్లపై ఇషాన్, రోహిత్ తుఫానులా ముంచెత్తారు. ముఖ్యంగా ఇషాన్ అయితే కొడితే సిక్స్ లేదంటే ఫోర్ అన్న రేంజ్లో చెలరేగాడు. 9 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తిచేసిన ఈ జోడీని ఎట్టకేలకు ఆకాశ్ దీప్ విడదీశారు.
ఇషాన్ నిష్క్రమించినా వన్ డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. బ్యాట్లో స్ప్రింగులు పెట్టుకుని వచ్చాడా అన్న అనుమానం కలిగేలా బాదేశాడు. 15 పరుగుల వద్ద అతడిచ్చిన క్యాచ్ను డీప్లో మ్యాక్స్వెల్ జారవిడవడంతో సూర్య ఆ అవకాశాన్ని రెండుచేతులా అందుకున్నాడు. రోహిత్ ఔట్ అయినా హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్, 3 సిక్సర్లు) అండతో దుమ్మురేపాడు. 17 బంతుల్లోనే అతడి అర్ధ శతకం పూర్తైంది. ఐపీఎల్లో సూర్యకు ఇది వేగవంతమైన అర్ధసెంచరీ కావడం విశేషం. బౌలర్ ఎవరన్నది లెక్కచేయని నైజంతో సూర్య సృష్టించిన విధ్వంసానికి స్టేడియం హోరెత్తిపోయింది. మిస్టర్ ‘360’ అన్న ట్యాగ్లైన్కు తగ్గట్లు సూర్య కొట్టిన షాట్లకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 13వ ఓవర్లో సూర్య పెవిలియన్ చేరినా తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్, 3 ఫోర్లు) తో కలిసి పాండ్యా విజయ లాంఛనాన్ని పూర్తిచేశాడు.
16 ఓవర్లకు 149-4తో పటిష్టంగా కనిపించిన బెంగళూరుకు బుమ్రా వరుస ఓవర్లలో షాకులిచ్చాడు. 17వ ఓవర్లో డుప్లెసిస్తో పాటు మహిపాల్ లోమ్రర్(0)ను ఔట్ చేసిన అతడు.. 19వ ఓవర్లో సౌరవ్ చౌహాన్ (9), విజయ్కుమార్ (0)ను పెవిలియన్ చేర్చాడు.
బెంగళూరు: 20 ఓవర్లలో 196/8 (డుప్లెసిస్ 61, కార్తీక్ 53 నాటౌట్, బుమ్రా 5/21, గోపాల్ 1/32)
ముంబై : 15.3 ఓవర్లలో 199/3 (ఇషాన్ 69, సూర్య 52, జాక్స్ 1/24, వైశాక్ 1/32)