MSK Prasad : ఐపీఎల్ పదిహేడో సీజన్తో టీమిండియా(Team India) జెర్సీ తొడుక్కునే దమ్మున్న కొత్త తరుపుముక్క దొరికాడు. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తరఫున నిప్పులు చెరుగుతున్న యువ పేసర్ మయాంక్ యాదవ్(Mayank Yadav) సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. వరుసగా రెండు మ్యాచుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన ఈ ఢిల్లీ ఎక్స్ప్రెస్కు టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) స్క్వాడ్లో బెర్తుపై కర్చీఫ్ వేశాడని అంటున్నారంతా.
తాజాగా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad) సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘మయాంక్ బౌలింగ్లో వేగమే కాదు కచ్చితత్వమూ ఉంది. అందుకనే అతడికి చాన్స్ ఇవ్వాలి. గాయంతో టోర్నీకి దూరమైన షమీ స్థానంలో మయాంక్ను ఆడించాలి’ అని ఎమ్మెస్కే అన్నాడు.
ఎమ్మెస్కే ప్రసాద్, మయాంక్ యాదవ్
‘ఒత్తిడిలోనూ కచ్చితత్వంతో బౌలింగ్ చేయగల సత్తా మయాంక్ సొంతం. ఇప్పటికే అతడు అత్యుత్తమ ఆటగాళ్లను తన పేస్తో ఇబ్బంది పెట్టాడు. టీ20 వరల్డ్ కప్లో బుమ్రా, సిరాజ్ల తర్వాత మూడో సీమర్గా మయాంక్ పనికొస్తున్నాడు. వర్ధమాన ఆటగాడిగా అదరగొడుతున్న అతడిపై సెలెక్టర్లు నమ్మకం ఉంచాలి’ అని ఎమ్మెస్కే వెల్లడించాడు.
𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥
Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim
— IndianPremierLeague (@IPL) April 2, 2024
పదిహేడో సీజన్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన బక్కపలచని మయాంక్ తొలి మ్యాచ్లోనే నిప్పులు చెరిగాడు. ఈ ఎడిషన్లో ఫాస్టెస్ట్ డెలివరీ(గంటకు 156.7 కి.మీ. వేగం)తో రికార్డు నెలకొల్పిన అతడు మూడు వికెట్లతో పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను ఓటమి అంచుల్లోకి నెట్టాడు.
ఆ తర్వాత బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై మయాంక్ తన విశ్వరూపం చూపించాడు. సూపర్ డెలివరీతో కామెరూన్ గ్రీన్ను బౌల్డ్ చేసిన ఈ పేసర్.. ఆ వెంటనే రజత్ పాటిదార్ వికెట్ తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. నిలకడగా రాణిస్తున్న మయాంక్.. భారత క్రికెట్ జట్టుకు నాణ్యమైన పేసర్ కొరతను తీర్చేలా కనిపిస్తున్నాడు.