న్యూఢిల్లీ: ఎమ్మెస్ ధోనీ.. జులపాల జుట్టుతో టార్జాన్లా కనిపిస్తూ.. తన బండకొట్టుడు బ్యాటింగ్తో ఇండియన్ క్రికెట్లోకి ఎంటరై.. మిస్టర్ కూల్ ట్యాగ్తో ప్రపంచ క్రికెట్లోని బెస్ట్ కెప్టెన్స్లో ఒకడిగా రిటైరయ్యాడు. ఇండియన్ టీమ్ను వికెట్ కీపర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్న సమయంలో వచ్చిన ధోనీ.. ఆ ఒక్క పాత్రను నిలకడగా పోషిస్తే చాలని అంతా అనుకున్నారు. కానీ ఇండియన్ క్రికెట్నే మలుపు తిప్పే ఆల్రౌండర్ అతడని మొదట్లో ఎవరూ గుర్తించలేకపోయారు. మంచి వికెట్ కీపింగ్ నైపుణ్యంతోపాటు దూకుడైన ఆటతో టీమ్లో స్థానం నిలుపుకున్న ధోనీ.. తర్వాతి కాలంలో కెప్టెన్గా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడమే కాదు ఇండియన్ టీమ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలిచాడు. బుధవారం ఈ మిస్టర్ కూల్ తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ను మలుపు తిప్పిన అతని ఐదు కీలక నిర్ణయాలేంటో ఓసారి చూద్దాం.
ఓ కెప్టెన్గా ధోనీ ఎంతటి భిన్నమైన పాత్ర పోషించబోతున్నాడో చెప్పిన నిర్ణయమిది. 2007 వరల్డ్కప్ ఫైనల్ చివరి ఓవర్ను జోగిందర్ శర్మలాంటి ఓ అనామకుడికి ఇవ్వాలని నిర్ణయించడం చాలా మందిని షాక్కు గురి చేసింది. కానీ చివరికి ఆ ఎత్తుగడ ఫలించి.. తొలి టీ20 చాంపియన్గా టీమిండియా నిలిచింది. ధోనీ కెరీర్ను, ఇండియన్ క్రికెట్ను మలుపు తిప్పిన తొలి నిర్ణయం అది.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇషాంత్ శర్మ భారీగా పరుగులు ఇస్తాడన్న పేరుంది. అలాంటి బౌలర్కు కీలక సమయంలో బౌలింగ్ అప్పగించడం ధోనీకే చెల్లింది. 2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించారు. మొదట ఇండియా 129 పరుగులే చేసింది. తర్వాత ఇంగ్లండ్ ఆ టార్గెట్ను చేజ్ చేసేలానే కనిపించింది. ఇలాంటి సమయంలో కీలకమైన 18వ ఓవర్ను ధోనీ.. ఇషాంత్కు అప్పగించాడు. ధోనీ నిర్ణయం ఆశ్చర్యం కలిగించినా.. ఆ ఓవర్ను చాలా పొదుపుగా వేయడంతోపాటు మోర్గాన్, రవి బొపారా వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పాడు ఇషాంత్.
వరల్డ్కప్ ఫైనల్లో ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసు కదా. కానీ ఒత్తిడిలోనే రాణించే అలవాటు ఉన్న ధోనీ.. 2011 వరల్డ్కప్ ఫైనల్లో తనను తాను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసుకొని నాలుగోస్థానంలో వచ్చాడు. 275 పరుగుల లక్ష్య ఛేదనలో 114 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇండియాను గంభీర్, యువరాజ్లతో కలిసి ధోనీ ఆదుకున్నాడు. మొదట్లో మెల్లగా మొదలుపెట్టి.. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత చెలరేగే తన స్టైల్ను కొనసాగిస్తూ.. ఫైనల్లో 91 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సిక్స్తో అతడు మ్యాచ్ ముగించిన తీరు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పుడు వరల్డ్ క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనర్లలో ఒకడిగా పేరుగాంచిన రోహిత్ శర్మను అసలు తొలిసారి ఆ స్థానంలో పంపింది ధోనీనే. 2013 చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి రోహిత్ ఓపెనర్గా వచ్చాడు. అప్పటి వరకూ మిడిలార్డర్లో ఆడుతూ.. ఫామ్ కోసం తంటాలు పడుతూ.. టీమ్లోకి వచ్చి పోతూ ఉన్న రోహిత్ కెరీర్ ధోనీ తీసుకున్న ఆ నిర్ణయమే మలుపు తిప్పింది.
కెప్టెన్గా, ప్లేయర్గా ఎంత గొప్ప సక్సెస్ సాధించినా.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం అన్నది చాలా ముఖ్యం. తన కెరీర్ మొత్తం ధోనీ చేసింది అదే. చివరికి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం కూడా అలాంటిదే. సరైన సమయంలోనే ధోనీ తాను కెప్టెన్గా తప్పుకొని ఆ బాధ్యతలు కోహ్లికి దక్కేలా చేశాడు. ఆ తర్వాత కూడా ఫీల్డ్లో కోహ్లికి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటూ అతడు సక్సెస్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.